TDP : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిన్న పోలింగ్ బూత్ వద్ద పోలీసులతో రవీంద్ర వాగ్వివాదానికి దిగారు. దీనిపై ఎన్నికల విధులను ఆటంకం కలిగించారన్న అభియోగంపై రవీంద్రను నేడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర అరెస్టు నేపథ్యంలో మచిలీపట్నంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు రవీంద్ర ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంలో అరెస్టులకు భయపడేది లేదని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు.
కాగా కొల్లు రవీంద్ర అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితర టీడీపీ నేతలు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని చంద్రబాబు ఆరోపించారు. తక్షణం కొల్లు రవీంద్రను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.