TRS : తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగతా నేతల చాణక్యానికి కేసీఆర్ వ్యూహాలకు ఎంతో తేడా ఉంటుంది. అయితే, అలాంటి వ్యూహకర్త అడుగులు అర్థం కాకపోవడంతో టీఆర్ఎస్ నేతలే జుట్టు పీక్కుంటున్నారట. ఇదంతా ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక గురించి. ఔను టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారానికి వెళతారా..లేదా? అనేది విశ్లేషకులకే కాదు సొంత పార్టీ నేతలకు సైతం అంతుపట్టడం లేదట.
సాగర్ ప్రతిష్టాత్మకం…
తెలంగాణలో ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. నోముల నర్సింహయ్య తనయుడు భగత్కే టికెట్ ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి సాగర్ ఉపఎన్నిక బరిలో ఉన్నారు. వరస ఓటములతో సాగర్ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టగా తీసుకుంది. ఇక టీఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రులను, ఎమ్మెల్యేలను మండలాలవారీగా ఇన్ఛార్జ్లుగా కేసీఆర్ నియమించారు. జిల్లా మంత్రి జగదీష్రెడ్డితోపాటు ఇతర మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే, కేసీఆర్ ప్రచారం గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు.
టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే….
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బల తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంగా ఉన్న టీఆర్ఎస్ సాగర్ను చేజార్చుకోవద్దని భావిస్తోంది. అయితే, తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి వెళతారో లేదో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసి హాలియా బహిరంగసభలో ప్రసంగిస్తూ.. జిల్లాకు, నాగార్జునసాగర్కు ప్రభుత్వం ఏం చేసిందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేశారు. మరోవైపు సాగర్ ప్రచార గడువు ముగింపు దగ్గర్లో ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రచారానికి వెళతారా లేదా అనే చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది.