రాజకీయాల్లో ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారం పెరిగిపోతోందా? అంటే.. ఔననే చెప్పాలి. ముఖ్యంగా డీప్ ఫేక్ వచ్చిన తర్వాత.. ఈ పరిణామాలు మరింతగా మారుతున్నాయి. రెండు రోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరికి సంబంధించిన ఓ బూతుల ఆడియో హల్చల్ చేస్తోంది. దీనిలో ఆమె ఎవరినో తీవ్రంగా దూషిస్తున్నట్టు ఉంది. కానీ, ఇది ఫేక్ అని టీడీపీ నేతలు మొత్తుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా.. ఫిర్యాదు చేశారు.
దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు.. కనీసం సోషల్ మీడియాలో నుంచి దీనిని తొలగించే చర్యలు కూడా చేపట్టలేదు. ఒకవైపు దీనిపై గందరగోళం కొనసాగుతుండగానే.. మరోవైపు, తాజాగా చంద్రబాబు టార్గెట్ అయ్యారు. ఆయనను ఉద్దేశించి కూడా.. సోషల్ మీడియాలో ఫొటోలు, కామెంట్ల వరద కురుస్తోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ తన పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు.
అయితే.. ఆయన మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సమయంలో దీనిని ప్రత్యక్షంగా చంద్రబాబు ఓ టీవీలో లైవ్ వీక్షిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అంతేకాదు.. వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోను వింటూ.. చంద్రబాబు ఉలిక్కిపడ్డారని కూడా కామెంట్లు చేశారు. ఇది కూడా ఫేకేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి సోషల్ మీడియాలో షేరైన ఫొటోలను చూసినా.. ఇది నకిలీ చిత్రమేనని తెలుస్తుంది. ఎందుకంటే.. చంద్రబాబు కూర్చున్న ప్రాంగణం.. ఆయన వీక్షిస్తున్న తెర వంటివి.. ఇప్పటివి కాదు.
ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) ఆఫీస్లోది. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వ అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఈ కార్యాలయాన్ని ఎంచుకున్నారు. పెద్ద తెరపై నివేదికల్ని పరిశీలన చేసేవారు. అప్పటి ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి.. చంద్రబాబుకు చలీ జ్వరం పట్టుందని.. జగన్ మేనిఫెస్టోను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారని ఫేక్ న్యూస్ పుట్టించారు. దీనిపైనా టీడీపీ ఫిర్యాదు చేయడం గమనార్హం.