CBI Case: వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. రఘురామ కృష్ణం రాజు అసమ్మతి స్వరం వినిపించిన వెంటనే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఎంపిల బృందం లోక్ సభ స్వీకర్ ఓం బిల్లాను కలిసి రఘురామకృష్ణం రాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి నిత్యం ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వైఎస్ జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు సంధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రఘురామ కృష్ణం రాజుపై నర్సాపురం నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. వీటిపై రఘురామకృష్ణం రాజు హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుండి రక్షణ పొందారు.
CBI Case: కోర్టులో 22న విచారణ
అయితే ఆ తరువాత చెన్నైలోని ఓ బ్యాంకు అధికారి ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణం రాజు, ఆయన భాగస్వాములపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీని వెనుక ఏపి సీఎంఓ హస్తం ఉందని ఆరోపణలు చేసిన రఘురామ కృష్ణం రాజు.. వైఎస్ జగన్ పై మరింత దూకుడు పెంచారు. అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్న సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణను వేగవంతం చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో రఘురామ కృష్ణం రాజు పది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ లో సరైన పత్రాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలంటూ కోర్టు రిజక్ట్ చేశారు. ఆ తరువాత మళ్లీ రఘురామకృష్ణం రాజు సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సరైన పత్రాలతో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22వ తేదీ నుండి రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ జరపనున్నది. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులను రఘురామకృష్ణం రాజు ఈ పిటిషన్ పై వాదనలు వినిపించడానికి నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓ పక్క బీజేపీ నేతలు కూడా జగన్ బెయిల్ ఎప్పుడైనా రద్దు కావచ్చంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో రఘురామ కృష్ణం రాజు ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని కోర్టు విచారణకు స్వీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారనీ, సాక్షులను ప్రభావితం చేస్తూ సహ నిందితులకు అధికారం ఉపయోగించి లబ్ది చేకూరుస్తున్నారనీ పదువులు ఇస్తున్నారని బెయిల్ రద్దు పిటిషన్ లో రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తమ పార్టీ పరువు పోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే బాధ్యతాయుత ఎంపిగా, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎంపిగా తాను పిటిషన్ వేసినట్లు ఆయన చెబుతున్నారు. జగన్మోహనరెడ్డి విషయంలో రఘురామకృష్ణం రాజు చేస్తున్న ఈ న్యాయపోరాటం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.