YS Jagan : అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. నవరత్న పథకాలను కొనసాగిస్తూ మరో ప్రతిష్టాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. అది ఏమిటంటే రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానం. రేషన్ సరుకులను నేరుగా కార్డుదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని జగన్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున వాహనాలను సిద్ధం చేసింది. ఇటీవలే విజయవాడలో ఈ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. అయితే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఎన్నికల కోడ్ లేని విజయవాడ నగరంలో జగన్ మూడు జిల్లాలకు చెందిన వాహనాలను ప్రారంభించారు. ఇతర జిల్లా కేంద్రాల్లో అక్కడి మంత్రులు వాహనాలను ప్రారంభించారు. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్ననేపథ్యంలో రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పిబ్రవరి 1వ తేదీ నుండి నూతనంగా ఎర్పాటు చేసిన వాహనాల ద్వారా డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే డోర్ డెలివరీ వాహనాలు ఆయా మండలాలు, గ్రామ పంచాయతీలకు చేరాయి. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రేషన్ డోర్ డెలివరీ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే ఈ పథకం నూతనంగా తెచ్చింది కాదని చెప్పేందుకు పౌరసరఫరాల శాఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. 2019 సెప్టెంబర్ నెలలో వాలంటీర్ల ద్వారా రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. అప్పటి నుండి ఆ జిల్లాలో వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానం అమలు అవుతోంది.
ఈ విషయాలను పౌరసరఫరాల శాఖ ఎస్ఈసీకి వెల్లడించి రేషన్ డోర్ డెలివరీకి అనుమతి కోరే అవకాశం ఉంది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ దీనికి మోకాలడ్డే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన వాహనాలపై సీఎం జగన్ ఫోటోలు, వైసీపీ జండా పోలిన రంగులు ఉండటంతో ఎస్ఈసీ అభ్యంతరం పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానం పాతదే అయినందు వల్ల ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గకుండా అమలునకు పట్టుబడుతుందా? ఎస్ఈసీ ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.