YS Jagan : జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నుండి రాష్ట్రంలో అనేక అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి..! ఒకటి ముగియక మునుపే ఇంకోటి చుట్టుముడుతున్నాయి..! ఈ క్రమంలోనే గడిచిన ఏడాదిన్నరలో రాష్ట్రంలో గొడవలను ప్రజావేదిక కూల్చివేత అనీ, మూడు రాజధానులు అనీ, అమరావతి ఇన్సైడర్ స్కామ్ అనీ, టీడీపీ నేతల అరెస్టు అని, నిమ్మగడ్డతో జగన్ పోరు అనీ.., న్యాయమూర్తులతో గొడవ అనీ… ఇలా అనేక అంశాలను చెప్పేయొచ్చు..! ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడైతే వివాదం అయిపోలేదు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనేనో.., ముగియక మునుపెనో.., మరో అత్యంత వివాదాస్పద అంశం సిద్ధంగా ఉంది..!!
నిన్న గవర్నర్ ప్రసంగంలో కీలక అంశం గమనించారా..?! YS Jagan
నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ప్రసంగం విన్న వారికి, చదివిన వారికి విషయం ఇప్పటికే అర్ధమై ఉంటుంది. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని.., కోర్టు స్టే ఇచ్చిన అంశాన్ని గవర్నర్ కీలక అంశంగా చేర్చి ప్రసంగించారు. అదే “మూడు రాజధానులు”..! “ప్రాంతాల మధ్య సమతుల్యత కోసం ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ చేపట్టింది” అంటూ మూడు రాజధానుల అంశాన్ని గవర్నర్ రిపబ్లిక్ డే ప్రసంగంలో ముఖ్యమైన అంశంగా చేర్చారు. నిజానికి ఈ వివాదం కోర్టులో ఉంది. ప్రభుత్వం ఆమోదించిన “పరిపాలన వికేంద్రీకరణ బిల్లు.., సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు..” లపై హైకోర్టు స్టే విధించింది. పూర్వస్థిస్తాయిలో వాదనలు వింటుంది. ప్రస్తుతం ఈ బిల్లులపై వాదన కోర్టులో కీలకంగా ఉంది. అటువంటి దశలో గవర్నర్ ప్రసంగంలో దీన్ని ఎందుకు హైలైట్ చేసినట్టు..!? గత ఏడాది జనవరి 26 నాడు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాయింట్ హైలైట్.., ఆగష్టు 15 న సీఎం ప్రసంగంలోనూ ఇదే పాయింట్ హైలైట్.. ఇప్పుడు నిన్నటి ప్రసంగంలోనూ ఇదే కీలక అంశంగా చేర్చారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశంగా “మూడు రాజధానులు” ఉంటె ఉండవచ్చు.. కానీ “రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థగా ఉన్న కోర్టు స్టే ఇచ్చిన అంశంపై.., రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్.. రాజ్యాంగానికి అత్యంత కీలకమైన రోజున” ప్రస్తావించడమే ఇక్కడ కీలకంగా మనం చెప్పుకోవాల్సిన అంశం. ఇది కోర్టు ధిక్కరణ కాదు. కానీ గవర్నర్ నైతిక అంశంగా మాత్రం వస్టసుంది..!!
స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే తీర్పు..!?
మూడు రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉంది. చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి బెంచ్ దీన్ని విచారిస్తుంది. డిసెంబర్ నెలాఖరున నాటి సీజే జేకే మహేశ్వరీ బదిలీ అయ్యారు. అప్పటి వరకు దాదాపు 40 రోజుల పాటు ఆయన వాదనలు విన్నారు. ఇప్పుడు జడ్జి మారారు. అంటే నాటి వాదనలు కొనసాగించి… ఎక్కడ ఆగిందో అక్కడి నుండి విచారణ కొనసాగిస్తారా..? లేదా ఫ్రెష్ గా వాదనలు వింటారా..? అనేది ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ వాదనలు కొనసాగిస్తే మాత్రం ఫిబ్రవరి నెలాఖరు నాటికి హైకోర్టు నుండి తుది తీర్పు వచ్చే వీలుంది అంటున్నారు. లేదా.. ఆయన మొదటి నుండి వాదనలు వింటే మాత్రం ఏప్రిల్ నెలాఖరు వరకు అవ్వవచ్చు. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఈ అంశంలో సాధ్యమైనంత త్వరగా అనుకూల తీర్పు వస్తే.. పాలనను విశాఖకు షిఫ్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
* సో.., ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల గొడవ తెరపైన ఉండడంతో మూడు రాజధానుల గొడవ పక్కకు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అందుకే అందరి చూపు మూడు రాజధానుల అంశంపై పడింది. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే అమరావతి ప్రాంత రైతులు సుప్రీం కోర్టుకి వెళ్లనున్నారు.., ఒకవేళ అమరావతికి అనుకూలంగా వస్తే ప్రభుత్వమే సుప్రీమ్ తలుపు తట్టనుంది. అంటే ఏది ఏమైనా హైకోర్టు తీర్పు మాత్రమే ఫైనల్ కాబోదు. సుప్రీం వరకు విషయం వెళ్తుంది. అంటే ఫిబ్రవరి నెలాఖరుకి హైకోర్టులో తీర్పు వచ్చేసినప్పటికీ.., సుప్రీం కి వెళ్లడం, సుప్రీం నుండి తుది తీర్పు రావడానికి మాత్రం కొన్ని రోజులు గడువు పట్టవచ్చు. మొత్తానికి ఉగాది నాటికి అంతా సద్దుమణుగుతుంది అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి..!!