YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు కడప కోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఏ 5 గా పేర్కొని సీబీఐ అరెస్టు చేసింది. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో కడప రిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ కడప కోర్టులో దేవిరెడ్డి న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.
YS Viveka Case: బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో దేవిరెడ్డి శివశంకరరెడ్డి కీలక నిందితుడుగా ఉన్నారని సీబీఐ తరపున న్యాయవాది తమ అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసుకు ఏకంగా రూ.40కోట్లు సుపారీ ఇచ్చేందుకు దేవిరెడ్డి సిద్ధంగా ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి తన స్టేట్ మెంట్ లో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున అతనికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనీ, ఈ కారణంగా శివశంకరరెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. వివేకా గత విచారణ సమయంలో సీబీఐ విజ్ఞప్తి మేరకు పులివెందుల కోర్టు నుండి వివేకా కేసును కడప కోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే.