Corona Virus.. కంటికి కనపడని శత్రువు. ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన మహమ్మారి. ప్రపంచాన్ని శాసించే దేశాలు, సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రశాంతతకు చిరునామాగా నిలిచే దేశాలు, పేద దేశాలు, ఉగ్రవాదం నిండిపోయిన దేశాలు.. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు, అణు సంపత్తి ఉన్న దేశాలు.. ఇలా పేర్లు మారినా ఎవరినీ వదల్లేదు. ఏడాదిగా తన వికృత కబంధ హస్తాల్లో బంధించేసింది కరోనా మహమ్మారి. మానవులు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎంత అప్రమత్తంగా ఉండాలో.. నేటి రోజులు ఎలా ఉన్నాయో కరోనా చెప్పింది. ఈ ఉపద్రవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తోంది. ముఖ్యంగా రెండు వ్యక్సిన్లు అభివృద్ధి చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత్ లో ఇటివల కేసులు తగ్గాయి. అయితే.. నిర్లక్ష్యం అణువణువునా నింపుకుని భారతీయులు చేస్తున్న తప్పుకు మళ్లీ కేసులు పెరగడం కలవరపెడుతోంది.
Corona Virus నిర్లక్ష్యం నిలువెల్లా.. మళ్లీ..
ప్రపంచంతోపాటు భారత్ లో కూడా కరోనా కేసులు ఎలా పెరిగాయో చూశాం. అయితే.. భారత్ తీసుకున్న అత్యంత కట్టుదిట్టమైన చర్యలు ప్రపంచాన్నే నివ్వెరపరిచాయి. లాక్ డౌన్ ప్రకటించి దేశం మొత్తాన్ని బంధించారు. అత్యవసరమైతే తప్ప.. అది కూడా నిర్దేశించిన వేళల్లో మాత్రమే బయటకొచ్చేలా తీసుకున్న చర్యలు ఫలించాయి. ఆర్ధికంగా దేశం కుదేలైనా, ఎన్నో రంగాలు దెబ్బతిన్నా, ప్రజలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తినా.. అంతా భవిష్యత్ బాగు కోసమే. ఇప్పుడవే ఫలితాలు ఇచ్చింది. దేశం మెలమెల్లగా కోలుకుంది. ఆర్ధిక రంగం గాడిన పడుతోంది. ప్రజలు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కేసుల తీవ్రత తగ్గింది. ప్రతిరోజూ వేలల్లో నమోదైన కేసులు గనణీయంగా తగ్గాయి. అయితే.. కరోనా విజృంభించిన సమయంలో ప్రభుత్వ సూచనలు, సెలబ్రిటీలు పెంచిన అవగాహనతో ప్రజలు ఎంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారో.. ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా అలసత్వం మొదలైంది. మాస్కులు పెట్టుకోవడం దాదాపు మానేశారు. భౌతిక దూరం కాకపోయినా కనీస జగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎలా కేసుల తీవ్రత తగ్గిందో.. ఇప్పుడు మళ్లీ కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ.. రాష్ట్రాల్లో కేసులు పెరగడం కలకలం రేపుతోంది. చత్తీస్ ఘడ్, పంజాబ్, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్ లో కూడా కేసులు పెరగడం.. నిర్లక్ష్యానికి నిదర్శనాలే.
దేశంలో ప్రస్తుత పరిస్థితి..
గడచిన 24 గంటల్లో దేశంలో 10,584 కొత్త కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. ప్రస్తుత రోజుల్లో ఇది చాలా ఎక్కువ. గత ఏడాది మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కేరళ.. వంటి రాష్ట్రాల్లో ఒక్కరోజులోనే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య. రెండు నెలలుగా దేశంలో కేసుల సంఖ్య గనణీయంగా తగ్గాయి. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. మొత్తంగా 1,17,45,552 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. వివిధ దేశాలకు భారత్ నుంచి వ్యాక్సిన్లు కూడా వెళ్లాయి. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూశాయి. డబ్ల్యూహెచ్ఓ కూడా కరోనాపై భారత్ పోరాటాన్ని మెచ్చుకుంది. కానీ.. ఇప్పుడు అదే భారత్ లో నిర్లక్ష్యం మొదలైంది. దేశంలో మొత్తంగా 1,10,16,434 కేసులు నమోదయ్యాయి. 1,56,463 మంది కరోనాతో మృతి చెందారు. ఇంకా 1,47,306 మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా N440K, E484K కొత్త రకం వేరియంట్లు ఉన్నయని వార్తలు వస్తున్నాయి.
గతం మర్చిపోకపోవదమే శ్రీరామరక్ష..
దేశంలో మళ్లీ కేసులు పెరగడానికి ఇవే కారణమని చెప్తున్న కేంద్రమే.. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్తోంది. భారతీయులు కరోనా నిబంధనలు గాలికి వదిలేయడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో లాక్ డౌన్ విధించారు. పూణెలో కర్ఫ్యూ విధించారు. నిర్లక్ష్యానికి తోడు ప్రజల్లో యాంటీ బాడీల వృద్ధి శాతం 22 మాత్రమే ఉండటం ఒక కారణం. కనీసం 75శాతం మందిలో వైరస్ ను ఎదుర్కోనే యాంటీబాడీలు ఉంటేనే కట్టడి సాధ్యం అని ఐసీఎంఆర్ మాజీ డీడీ రామన్ గంగాఖేడ్కర్ అంటున్నారు. కరోనా దెబ్బకి అమెరికా వణికింది. లండన్ కోలుకోలేదు. కానీ.. భారత్ ధీటుగా ఎదుర్కొంది. అత్యధిక జనాభా కలిగినా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేశారు. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వ్యాక్సిన్ వచ్చింది, కరోనా తగ్గింది అనే భావన నుంచి ప్రజలు బయటకు రావాలి. గత ఏడాది ఇబ్బందులను మరువకుండా తగిన జాగ్రత్తలు పాటించడమే మనకు శ్రీరామరక్ష.