YSRCP: రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది.. నిజమే ఆయన ఎంపీగా అనర్హుడు.. వైసీపీ జెండాతో గెలిచి.., జగన్ ఫొటోతో గెలిచి.. ఆ పార్టీని, ఆ వ్యక్తిని కించపరిచేలా మాట్లాడడం నైతికత కాదు. ఆయనను తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలి.. ఇక్కడ వైసీపీ వాదనలో బలం ఉంది..! కానీ ఒక పెద్ద నైతిక చిక్కులో వైసీపీ చిక్కుకుంటుంది. ఒక పెద్ద తప్పులో వైసీపీ కాలేసింది. అడ్డంగా దొరికిపోయింది కూడా..!
YSRCP: ఆ నలుగురి కథకీ – ఈ ఒక్కడికీ లింకు..!?
రాజ్యాంగం ప్రకారం చట్టసభల్లో సభ్యులకు (ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా) ఒకే తరహా హక్కులు/ అధికారాలు ఉంటాయి. వారి గెలుపు, ఐదేళ్లు పదవీ కాలం, హక్కులు, ప్రోటోకాల్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే పరిధి మాత్రమే పెరుగుతుంది. సో.. ఈ లెక్కన ఎంపీ రఘురామకృష్ణం రాజు కోటాలోకే ఏపీలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వస్తారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.., విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.., గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్.. ఈ నలుగురు 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి అనధికారికంగా వైసీపీలో చేరిపోయారు. వారిలో ఇద్దరు (వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్) టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండగా.., మిగిలిన ఇద్దరు మాత్రం దోబూచులాడుతున్నారు..! సో… నైతికంగా చూసుకుంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలకు రఘురామకృష్ణంరాజుకి లింకు ఉంది. వీరికి ఒకేరకమైన చట్టసభ నిబంధనలు, రాజ్యాంగ హక్కులు వర్తిస్తాయి..
ఎవరిని.. ఎవరు.. ఎలా సమర్ధించగలరు..!?
ఏపీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అనధికారికంగా వైసీపీలో చేర్చుకున్నారు. ఆ పార్టీ అధినేతని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మైక్ దొరికితే తిడుతున్నారు. దాన్ని వైసీపీ సమర్థిస్తుంది. వారికి ఆ పార్టీ విధానాలు నచ్చలేదు కాబట్టి తిడుతున్నారు అని వెనకేసుకొస్తుంది.. చంద్రబాబు రాజకీయం నచ్చలేదు, టీడీపీ అంటే గిట్టక వచ్చేసారు. వైసిపిలో చేరలేదు కదా..! అని వాదిస్తుంది. ఇక్కడ ఇదే కోవలోకి రఘురామకృష్ణంరాజు వ్యవహారం కూడా వస్తుంది.. ఆయన కూడా పార్టీ విధానాలు నచ్చలేదు కాబట్టి వైసిపిని, సీఎం జగన్ ని తప్పుపడుతున్నారు.. ఎంపీని ఏ రూల్ ప్రకారం అనర్హత వేటు వేయాలని వైసిపి కోరుతుందో… అదే రూలు ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలను కూడా అనర్హత వేటు వేయాలి. వాళ్ళు నలుగురినీ అనర్హత వేటు వేయాలని టీడీపీ ఇచ్చినప్పటికీ ఫిర్యాదు స్పీకర్ పట్టించుకోలేదు.. ఇక్కడ వైసిపి కి చెందిన అసెంబ్లీ స్పీకర్ ఆ నలుగురినీ అనర్హులుగా చేస్తే, అక్కడ పార్లమెంటులో వైసిపి నైతికత నిరూపించుకుని.. దీన్ని ఉదాహరణగా చూపించి రఘురామా విషయంలో గట్టిగా పోరాడవచ్చు.. అప్పటి వరకు వైసిపి ఎన్ని చేసినా నైతికత విషయంలో వెనకడుగు వేసినట్టే.. టీడీపీకి, రఘురామకి ఇదే పెద్ద ఆయుధంగా దొరుకుతుంది..!