ప్రపంచవ్యాప్తంగా శివాలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక్కోకటి ఒక్కో విశేషంతో అలరారుతున్నాయి. కొన్నింటి నిర్మాణ విశేషాలు నేటికి అంతుపట్టడం లేదంటే నాడు నిర్మించిన వారి సాంకేతిక ఎంత అద్బుతమో. ఇక అలాంటి కోవలోకే వచ్చే ఒక శివాలయం గురించి తెలుసుకుందాం…
సముద్రతీరంలో నిర్మించిన ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. నీటిమట్టం తగ్గి ఆ ఆలయం బయటపడినప్పుడు భక్తులు వెళ్లి దర్శనం చేసుకోవడమూ సహజమే. కానీ అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యం అయిపోతూ, అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే!
స్కందపురాణంలో…
గుజరాత్లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడి అరేబియా సముద్రతీరంలో ఉన్న ఈ ఆలయం గురించి స్కందపురాణంలో కూడా ప్రసక్తి ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులు. శివుని కుమారుడైన కార్తికేయుడు, తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందే. తారకాసురుడు లోకకంటకుడే కావచ్చు. కానీ అతను మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించిపోయాడు. కార్తికేయుని దుగ్ధను గమనించిన విష్ణుమూర్తి ‘శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని’ సూచించాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు.