మాసాలలో మార్గశిరమాసంగా విష్ణుమూర్తి ప్రకటించుకున్న మాసం ఇది. అత్యంత విశేషమైన, పవిత్రమైనవాటిలో ఇది ఒకటి. హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల.
దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమని పేరు. ఈనెలలో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు. మనక మనస్సుకు అధిపతి చంద్రుడు. అందుకే చంద్రమామనసోజ్యాత అని అంటారు. అయితే ఆ చంద్రుడుకి అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. ఈ మాసంలో ప్రాతఃకాలంలో లేవడం, స్నానం, విష్ణు ఆరాధన, పాశురాలను చదవడం, వినడం, దాన, ధార్మలు అత్యంత శ్రేష్టమైన పనులు. స్వామికి భక్తితో అర్పించే ప్రతి ఒక్కటి స్వామి తానే స్వీకరించే మాసం ఇది. ఈ మాసంలో ముక్కోటి ఏకాదశి, దత్తాత్రేయజయంతి అత్యంత పవిత్రమైన పండుగలు.