భాద్రపదమాసంలో బహుళ పక్షంలో వచ్చే 15 రోజులను పితృపక్షాలుగా పిలుస్తారు. ఈ రోజుల్లో మరణించిన పెద్దలకు శ్రాద్ధం (దీన్నే పక్షంగా వ్యవహరిస్తుంటారు) పెట్టుకోవడం ఆచారంగా వస్తుంది.
పెద్దలు మరణించిన తిథుల్లో పక్షం పెట్టుకుంటారు. వీలుకాని వారు ఏదో ఒకరోజు వారివారి పెద్దల పేరున పితృకర్మలు చేస్తారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది. దీనివల్ల పెద్దలకు పుణ్యగతులు వస్తాయని విశ్వాసం. అదేవిధంగా ఈ సమయంలో చేసే ఆయా దానాలు అనంత ఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలలో ఉంది.
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షం…ఈ పక్షములో పితరులు అన్నాన్ని , ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున , మహాలయ పక్షములలో పితృతర్పణములు , యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే , పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు , తమ వంశాభివృద్ధి జరుగును . వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు , నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.