శివాలయాలలు ప్రపంచం అంతా ఉన్నాయి. ఇక మన దేశంలో అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు, స్వయంభూ లింగాలు పంచభూతాత్మిక లింగాలు ఇలా అనేక రకాలైన శివాలయాలు ఉన్నాయి.
పరమపవిత్రమైన అటువంటి శివక్షేత్రం గురించి తెలుసుకుందాం.. పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ‘తిరుక్కరుగావూర్’ ఒకటి. తమిళనాడు తంజావూరులో పాపనాశనం తాలూక పరిథిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి స్వామిని ముల్లైవనాథర్ అనీ .. అమ్మవారిని గర్భ రక్షామ్బిక అని పిలుస్తారు. స్వామివారు ఇక్కడ స్వయంభువు .. పుట్టమన్నుతో ఏర్పడిన శివలింగం. ఈ కారణంగానే ఇక్కడి శివలింగానికి జలంతో కాకుండా పుష్పాలతో అభిషేకం చేస్తారు. కొన్ని సందర్భాలలో మల్లేల నూనెతో అభిషేకం చేస్తారని చెప్తారు.
క్షేత్ర మహిమలు:
శైవ మహా భక్తులైన అప్పర్ .. సుందరార్ .. జ్ఞాన సంబంధర్ ఇక్కడి స్వామివారిని కీర్తించారు. స్వామివారి దర్శనం వలన చర్మ సంబంధమైన వ్యాధులు తగ్గిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడి అమ్మవారు 7 అడుగుల ఎత్తును కలిగి ఉండటం విశేషం. అమ్మవారి అలంకారం చూసి తీరవలసిందేనని అంటారు. సంతానాన్ని ప్రసాదించడం .. గర్భవతులను రక్షించడం అమ్మవారి ప్రత్యేకత అని చెబుతారు. వేయి సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయంలో అడుగుపెట్టడంతోనే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. విశేషమైన ఈ క్షే్త్ర దర్శనం వల్ల అనేక ఫలితాలు వస్తాయిని పండితులు పేర్కొంటున్నారు.