Ukraine Crisis: ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. గత 11 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధానితో సహా పలు ప్రధాన నగరాలను ఆధీనంలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రష్యా సైనిక చర్యను ఉక్రెయిన్ సతవిధాలుగా అడ్డుకుంటోంది. ఈ తరుణంలో మరో సారి రేపు రష్యా – ఉక్రెయన్ ల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. మూడవ సారి జరుగుతున్న చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బెలారస్ వేదికగా రెండు పర్యాయాలు చర్చలు జరిగినా అసంతృప్తిగా ముగిసాయి. ఇరు దేశాల షరతుల షరతుల నేపథ్యంలో చర్చలు ముందుకు సాగలేదు.
Read More: Ukraine Russia War: మోడీజీ మరో సారి మాట్లాడండి
Ukraine Crisis: విరామం ఇచ్చినట్లే ఇచ్చి..
దీంతో మరో సారి చర్చలకు సిద్ధమయ్యింది ఉక్రెయిన్. రష్యా కూడా చర్చలకు అంగీకారం తెలియజేసింది. రేపు జరిగే చర్చల్లో సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గెదే లే అంటున్నారు. ప్రపంచ దేశాలకు ఆయన ఇప్పటికే హెచ్చరికలు పంపారు. ఉక్రెయిన్ నుండి పౌరులు సురక్షితంగా తరలింపునకు వీలుగా దాడి నుండి మేరియుపొల్, వోల్నోవాఖ నగరాల్లో కాస్త విరామం ఇస్తామని ప్రకటించిన రష్యా.. విరామం ఇచ్చినట్లే ఇచ్చి మరల కొద్ది గంటల్లోనే యథావిధిగా దాడులు కొనసాగించింది. క్షిపణులు, రాకెట్లు, బాంబుల దాడి నుండి ఉక్రెయిన్ కాసేపు ఊరట లభించినట్లు కనిపించినా అంతలోనే రష్యా మరో సారి విరుచుకుపడి వారి ఆశలను అడియాసలు చేసింది.
ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తే..
సురక్షితంగా నగరాన్ని దాటించేందుకు వేల మంది ప్రజలను బస్సుల్లో సిద్ధం చేసినా బాంబుల మోత ఆగకపోవడంతో తరలింపు ప్రక్రియ నిలిపివేసినట్లు మేరియుపొల్ మేయర్ ప్రకటించారు. మరో పక్క ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న జెలెన్ స్కీ డిమాండ్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశమైనా ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ (నిషిద్ధ గగనతలం) గా ప్రకటిస్తే ఆ దేశం కూడా అక్కడి యుద్దంలో పాల్గొంటున్నట్లుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ తరుణంలో రేపు జరిగే చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.