Ukraine Russia War: ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్ లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇదే క్రమంలో రష్యా పై ఉక్రెయిన్ ఎదురుదాడితో ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు మృతి చెందుతున్నారు. రష్యా యుద్ద విమానాలను కూల్చివేస్తున్నారు ఉక్రెయిన్ సైనికులు. ఇదిలా ఉంటే మరో సారి భారత ప్రధాని మోడీ జోక్యం చేసుకుని యుద్ద నివారణకు మధ్య వర్తిత్వం వహించాలని ఉక్రెయిన్ కోరుతోంది. రష్యా దాడులను నిలిపివేసేందుకు మథ్య వర్తిత్వం వహించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. రష్యాతో భారత్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా యుద్ద నివారణకు భారత్ జోక్యం చేసుకోవాలని కోరారు. భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ రష్యాపై వత్తిడి తేవాలని కులేబా కోరారు.
Ukraine Russia War: ఆహార ఉత్పత్తులపై ప్రభావం
తమ దేశం ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్లో భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందని గుర్తు చేసిన ఆయన యుద్ధం కొనసాగితే దాని ప్రభావం ఆహార ఉత్పత్తులపై పడుతుందన్నారు. అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని రష్యా నిలిపివేసేలా భారత్ కృషి చేయాలని దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధాన్ని విరమించాలని రష్యాను కోరినా రష్యా అధ్యక్షుడు ససేమిరా అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా అనేక ఆంక్షలు విధిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు శాంతి చర్చలు జరిగినా ఫలప్రదం కాలేదు. ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధినేత పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు.