Wedding Hall: ఒక్కోసారి వివాహ వేడుకల సమయంలో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అంటారు పెద్దలు. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు అంటుంటారు. ఈ ఘటనలు పరిశీలిస్తే అవి నిజమేనని భావించాల్సి వస్తుంటుంది. ఇటీవల ఓ వథువు పెళ్లి పీటల మీద ముహూర్త సమయానికి వరుడికి ఒక మెలిక పెట్టింది, తన సోదరిని కూడా పెళ్లి చేసుకుంటాను అంటేనే తాళి కట్టించుకుంటాను అని. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం దేనికి అనుకున్నాడేమో అతను అక్కా చెల్లిళ్లు ఇద్దరినీ అదే వేదికపై వివాహం చేసుకున్నాడు. అలా ఒక్కో సారి కొన్ని సంఘటనలు యాదృశ్చికంగా జరుగుతూ ఉంటాయి.
అయితే ఇక్కడ ట్విస్ట్ మరోలా ఉంది. కాసేపటిలో పెళ్లి అనగా వరుడు కనిపించకుండా జంప్ అయ్యాడు. ముహూర్త సమయం వరకూ వేచి చూసిన వధువు తండ్రి చేసేది ఏమి లేక వివాహ వేడుకకు వచ్చిన అతిధుల్లో ఓ యువకుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని మహారాజ్ పూర్ పట్టణంలో ఇటీవల జరిగింది.
వివాహ వేదికపై సంప్రదాయం ప్రకారం వధూవరులు దండలు మార్చుకోవడం ముగిసింది. ఆ తరువాత పెళ్లి పీటల కూర్చునేందుకు గానూ బట్టలు మార్చుకునేందుకు వెళ్లిన వరుడు కనిపించకుండా పోయాడు. ఎటు వెళ్లాడో ఎవరికీ తెలియలేదు. వరుడి కోసం ఇరు కుటుంబాల వారు కొద్దిసేపు వెతికారు. అతని ఆచూకి లభించలేదు. ఈ లోపు ముహూర్తం దగ్గర పడుతోంది. వివాహ వేడుకకు దగ్గర బంధువులు అందరూ వచ్చారు. పీటల మీద వరకూ వచ్చిన పెళ్లి ఆగిపోతే తన పేరు ప్రతిష్టలకు భంగం అని భావించిన వథువు తల్లిదండ్రులు క్షణం ఆలస్యం చేయకుండా పెళ్లికి వచ్చిన వారిలో వివాహానికి సిద్ధంగా ఉన్న యువకులు ఎవరైనా ఉన్నారా వాకబు చేశారు.
ఓ యువకుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకుని వెంటనే ఆ యువకుడిని పిలిచి తమ కుమార్తెను చేసుకోవాలని ప్రాధేయపడ్డారు. తొలుత ఇంత షడన్ గా పెళ్లి అంటే ఎలా అని కొంత నసిగినా ఆ యువకుడి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఒప్పుకున్నాడు. అతిధిగా వచ్చిన ఆ యువకుడు వరుడుగా మారిపోయి పీటల మీద కూర్చోవడంతో పెళ్లి తంతు జరిగిపోయింది. పెళ్లికి వచ్చిన వారు ఈ తతంగం అంతా చూసి భగవంతుడు వీరిద్దరికి భార్యభర్తల యోగం కల్పించి అందుకే ఇలా జరిగింది అనుకున్నారు. ఇదంతా అయిపోయిన తరువాత వథువు తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ కు వెళ్లి మోసం చేసి పరారైన వధువుపై ఫిర్యాదు చేశారు.