Accident Case : రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే ఎందరినో సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్షించే వృత్తిలో ఉన్న 108 సిబ్బంది రోడ్డు ప్రమాద బాధితుల నుండి బంగారాన్ని కొట్టేసి అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే..పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపిలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు కొత్త శ్రీనివాసరావు (55), రాంబాబు (45) మృతి చెందారు. ఈ ఘటనలో వారి గుమాస్తా గుండా సంతోష్, కారు డ్రైవర్ డి సంతోష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కొన ఊపిరితో ఉన్న రాంబాబు, గుండా సంతోష్, డి సంతోష్ లను 108 అంబులెన్స్ లో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వద్ద ఉన్న బంగారు నగలను 108 సిబ్బంది ఎస్ఐ శైలజకు అందజేశారు.
బాధితుల బంధువులు ఆసుపత్రికి చేరుకున్న తరువాత తమ వారి వద్ద 5కేజీల 600 గ్రాముల బంగారం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. 108 అంబులెన్స్ సిబ్బంది 3కేజీల 300 గ్రాముల బంగారం మాత్రమే ఇవ్వగా, మిగిలిన 2కేజీల 300 గ్రాముల బంగారం ఏమైనట్లు అన్న సందేహం వ్యక్తం అయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు కేసును 24 గంటల్లో ఛేదించారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మారెడ్డి, ఎమర్జెన్సీ టెక్నిషియన్ తాజుద్దీన్ ను పోలీసులు విచారించగా మిగిలిన 2 కేజీల 300 గ్రాముల బంగారం తమ వద్దనే ఉందని అంగీకరించారు. వారి వద్ద నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బంగారంకు సంబంధించిన అన్ని బిల్లులను పరిశీలించి బాధితుల బంధువులకు బంగారం అప్పగిస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రమాదం నుండి ఎంతో మందిని కాపాడిన 108 సిబ్బంది అత్యాశకుపోవడం వల్ల వారికి చెడ్డపేరు వచ్చేలా చేసిందని అన్నారు. అత్యవసర సేవలు అందించే వారు ఇలాంటి పనులు చేయకూడదని హితవుపలికారు సీపీ సత్యనారాయణ.