టెక్నాలజీ పెరిగిపోయి సోషల్ మీడియా వచ్చాక అందరికీ తమను తాము ప్రెజంట్ చేసుకోవడం తేలికైపోయింది. సినిమా క్లిప్పింగ్స్, సొంతంగా క్రియేట్ చేసుకున్న థీమ్స్, జోక్స్,, అప్లోడ్ చేసుకుని సోషల్ మీడియా స్టార్స్ అయిపోయారు. ఇందుకు వీరికి ప్రధానంగా దోహదపడింది ‘టిక్ టాక్’. పబ్ జీ గేమ్ కు కొందరు బానిసైనట్టు ఎంతోమంది టిక్ టాక్ కు బానిసైపోయారు. ఇప్పుడు వీరందరికీ భారత ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. చైనాతో సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో ఆ దేశంలో పరోక్ష యుద్ధం మొదులుపెట్టింది.
ఇందుకు భారతీయుల మొబైల్స్ లో చైనా యాప్స్ ను బ్యాన్ చేసింది. దీంతో టిక్ టాక్ సంస్థ ఎంత ఆందోళన చెందిందో కానీ.. టిక్ టాక్ యూజర్స్ మాత్రం శరీరంలో ఓ భాగం పోయినట్టుగా ఫీలైపోతున్నారు. ఇన్నాళ్లు అప్రకటిత స్టార్స్ గా వెలిగిపోయినోళ్లు నీరసించిపోయారు. తాము చేసుకున్న వీడియోలు కూడా చూసుకోలేని పరిస్థితి. ఫోన్ లో యాప్ ఉన్నా ఓపెన్ కాదు కదా.. ఇన్నాళ్లు వీళ్లు చేసిన వీడియోలు కూడా ఎగిరిపోయాయి. తెలివిగా డౌన్ లోడ్ చేసుకున్నవారు తప్పించి అన్ని వీడియోలు డిలీట్ అయిపోయాయి.
ఇన్నాళ్లూ అలవాటు పడ్డ ప్రాణాలు ఊరికే ఉండలేవు కదా.. అందుకే ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. నాన్ చైనీస్ యాప్స్ ‘రోపోసో’ వంటివి రెడీగా ఉన్నాయి. కానీ.. టిక్ టాక్ అంత సౌలభ్యంగా ఉండవు. గుడ్డి కంటే మెల్ల నయం అనే సామెతలా ఇప్పుడు టిక్ టాకర్లంతా ఈ యాప్ లపై పడుతున్నారు. మమ్మల్ని ఫాలో అవండి అంటూ మెసేజెస్ చేస్తున్నారు. మరోపక్క టిక్ టాక్ బ్యాన్ చేసినందుకు నాన్ టిక్ టాక్ యూజర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.