YS Jagan Karnool Tour : రాయలసీమ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీ ప్రారంభించనున్నారు. ముందుగా ఈ నెల 26వ తేదీన ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే 26వ తేదీ భారత్ బంద్ సందర్భంగా కార్యక్రమాన్ని ఒక రోజు ముందుకు మార్పు చేశారు. ఈ ఎయిర్ పోర్టు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి నుండి విమాన రాకపోకలకు వీలు కలుగుతుంది. ఈ నెల 28వ తేదీ నుండి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
దేశంలో విమానయానాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం అమలు చేస్తోంది. దీని ద్వారా భారీ ఎయిర్ పోర్టుల నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యి ఎయిర్ స్ట్రిప్ట్ లను అభివృద్ధి చేస్తున్నది. ఇందులో భాగంగా ఏపిలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడి నుండి బెంగళూరు, గన్నవరం, హైదరాబాదుతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు పెంచేందుకు వీలుగా ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడనున్నది. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం లో భాగంగా ఈ ఎయిర్ పోర్టుకు అనుమతి ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించి దీన్ని నిర్మించింది. ఈ నెల 28వ తేదీ నుండి విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా ఇప్పటికే వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.