‘భోగిపండుగ’ కు ఆ పేరుఎలా వచ్చింది అన్న దాని వెనుక అనేక అభిప్రాయాలున్నాయి.భోగి పండుగ నాటికి రైతులకు పంటచేతికి రావడం వలన భోగభాగ్యాలను అనుభవించడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి దీనిని భోగి పండుగ అంటారని ఒక అభిప్రాయం కాగా.. భోగి దక్షిణాయనానికి,ధనుర్మాసానికీ, కూడా చివరిరోజు.రంగనాథుని ఆరాధించిన గోదాదేవి స్వామి వారిలో ఐక్యం చెందిన రోజు. భోగిపండుగగా జరుపుకుంటారని మరొక అభిప్రాయం కలదు. భోగి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలను తెలియచేస్తుంటారు.
భోగినాడు తెల్లవారుఝామునే భోగిమంటలు వేస్తారు. ధుర్మాసం అంతా ఆడపిల్లలు తయారు చేసిన గొబ్బిపిడకలను , రావి,మామిడి, మేడి చెట్ల పుల్లలు, తాటాకులు మొదలైనవి భోగి మంటల్లో వేయడం తో పాటు ఇంట్లో ఉండే పాత వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేస్తుంటారు. దీని అర్ధం ఏమిటి అంటే మనలో ఉన్న పనికిరాని చెత్త ఆలోచనలు తీసిపడేసి,కొత్త ఆలోచనల్లతో మంచి మార్గంలో జీవితం లో ఎదగాలని దీని అర్ధం. ఈ మంటలను వేస్తున్నప్పుడు,కొన్ని ప్రాంతాల్లో స్వర్గాధిపతి ఇంద్రుని గౌరవార్ధం డప్పులను వాయించే ఆచారము ఉంటుంది.
మంటలు వేసిన తర్వాత, తలంటి స్నానం చేయాలి. ఆ తరువాత ఇళ్ల ముందు ఆవును పేడతో కళ్ళాపు చల్లి, రంగురంగుల ముగ్గులు వేసి , గొబ్బెమ్మలు చేసి ముగ్గుల్లో పెట్టి, వాటికి పసుపు కుంకుమలను గుమ్మడి పువ్వుల ను అలంకరిస్తారు. దాని తర్వాత .. గొబ్బిళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కన్నెపిల్లలు ‘గొబ్బియల్లో… అంటూ పాటలు పాడి తరువాత హారతులుఇచ్చిన తర్వాత ఇంద్రుడి తో పాటు ఇష్ట దేవతలను పూజించాలి. పిల్లలకు బోగి రోజు సాయంత్రం భోగిపళ్లు తలపై పోయడం ద్వారా వారు మంచి జ్ఞానవంతులు అవుతారని అంటారు.
అయితే ఈ సారి భోగి పండుగ అమావాస్య రోజు రావడం తో పలుసందేహాలు కలుగుతున్నాయి. కానీ ఈ అమావాస్య భోగి రోజు ఈశ్వర అర్చన, రుద్రాభిషేకం, పితృ, తిలా దానం తిలా తర్పణాలు, స్వయంపాక దానాలు, వస్త్రదానాలు చేయడం వలన విశేషమైన ఫలితం వస్తుంది. భోగి రోజు దానాలు చేసేవారు భోగాలు అనుభవిస్తారు. ఇది ఒక పెద్ద విశేషం. ఇప్పుడు భోగి తో అమావాస్య రావడంవలన దానం చేసినదానికి వేయి రేట్లు ఫలితం వస్తుంది. కాబట్టి అమావాస్య రోజు వచ్చిన భోగి అని బెంగ పెట్టుకోకుండా రెట్టించిన సంతోషం తో సద్వినియోగం చేసుకోండి.