బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ 115 మంది తో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధినేత షాక్ ఇచ్చారు. దీంతో టికెట్ లు రాని వారిలో పలువురు పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సీరియస్ కామెంట్స్ చేశారు. తాను మూడో సారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని తనను పక్కన పెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖానాపూర్ బీఆర్ ఎస్ అభ్యర్ధిత్వం ఖారారు చేసిన జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని కూడా ఆరోపించారు. ఖానాపూర్ లో తన సత్తా ఏమిటో చూపిస్తానంటూ పరోక్షంగా పార్టీ అధిష్టానానికి సవాల్ చేశారు.
పార్టీలో, ప్రభుత్వంలో అగ్రవర్ణాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు రేఖా నాయక్. నియోజకవర్గం నుండి పోటీ చేసేది తానే గెలిచేది తానేనంటూ వ్యాఖ్యానించారు. రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆమె భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యామ్ నాయక్ నిన్న హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఠాాక్రే తో భేటీ అయ్యారు. దీంతో రేఖా నాయక్ కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైందని అంటున్నారు. త్వరలో అభిమానులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు రేఖా నాయక్.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రేఖా నాయక్ 2009 లో అసిఫాబాద్ జడ్ పీటీసీ మెంబర్ గా విజయం సాధించారు. 2013 లో తెలంగాణ రాష్ట్ సమితి (టీఆర్ఎస్) లో చేరిన రేఖా నాయక్ .. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. దీంతో 2014 ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన రేఖా నాయక్ .. టీడీపీ అభ్యర్ధి రితేష్ రాధోడ్ పై 30వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ 20వేలకు పైగా ఓట్ల అధిక్యతతో గెలిచారు.
BRS: అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో అగ్రకులాలకే అగ్రతాంబూలం .. కులాల వారీగా కేసిఆర్ లెక్క ఇది