“లాక్ డౌన్ ఉన్నంతకాలం ఒక లెక్క, సడలింపుల అనంతరం మరో లెక్క”… మిర్చీలో ప్రభాస్ స్థాయిలో కరోనా వైరస్ డైలాగులు చెబుతుంది. భారతదేశంలో సడలింపుల పేరుతో కరోనా వైరస వ్యాప్తికి పరోక్షంగా కారకులవుతున్నారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో… ఆ విమర్శలకు తగ్గట్లుగానే మహమ్మారి వైరస్ రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెంచేస్తుంది. ఒక్కరోజు వేలకు వేలల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. త్వరలోనే రోజుకు పది వేలు కూడా చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం!
లాక్ డౌన్ 4లో నిబంధనలు సడలింపులు ఇవ్వడం ఆంక్షలు ఎత్తేయడంతో వైరస్ రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలు దాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పటివరకు మొత్తం కేసులు 2,16,824 ఉన్నాయి. వాస్తవంగా మే 19వ తేదీ నాటికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొత్తం కేసులు 1,01,139 ఉండగా 3,163 మంది మృతి చెందారు. 15 రోజుల తరువాత ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,16,824గా ఉంది. ఇదే క్రమంలో మరణాల సంఖ్య 6,088! ఈ గణాంకాలను పరిశీలిస్తే దేశంలో కరోనా కేసులు పదిహేను రోజుల్లో రెట్టింపయ్యాయని తెలుస్తోంది.
ఈ భారీస్థాయి మార్పులకు కారణం కచ్చితంగా లాక్ డౌన్ లోని సడలింపుల ఫలితమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తం పరిశీలిస్తే లాక్ డౌన్ మినహాయింపులు మొదలైనప్పటినుంచీ కేసుల పెరుగుదల అనేది తీవ్రస్థాయిలో ఉంది. ఇప్పుడు దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కేసులు మరిన్ని పెరుగుతున్నాయి. ఈ విషయాలపై స్పందించిన నిపుణులు మాత్రం… అప్పుడే ఏమైంది? ఇంకా ముందు ఉంది.. ముసళ్ల పండగ! అంటున్నారట! సో… లాక్ డౌన్ ఎత్తారా లేదా అన్నది విషయం కాదు… జనాలు ఎవరికి వారు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఎంత స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు అన్నదే విషయం అన్నమాట!