కరోనా వైరస్ ఇప్పటి వరకు గాలి, స్పర్శ ద్వారా వ్యాప్తి చెందుతుందనే విషయం తెలిసిందే. కరోనా వైరస్ ఉన్న వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వారి నుంచి వెలువడే తుంపర్లు గాలిలో ప్రయాణించి ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తాయి. అలాగే కరోనా వచ్చిన వారిని టచ్ చేయడం వల్ల కూడా ఆ వైరస్ ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. అందుకనే సోషల్ డిస్టన్స్ పాటించమని చెబుతున్నారు. అయితే తల్లి పాల వల్ల కరోనా వ్యాపించదని సైంటిస్టుల అధ్యయనంలో తేలింది.
అమెరికాకు చెందిన పలువురు సైంటిస్టులు కరోనా సోకిన 18 మంది మహిళల నుంచి 64 పాల శాంపిల్స్ను సేకరించి పరిశీలించారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే.. కరోనా వైరస్ తల్లి పాలలో వృద్ధి చెందదని, అసలు వైరస్ అందులో ఉండదని తేల్చారు. అందువల్ల తల్లులు తమ పిల్లలకు నిర్భయంగా పాలివ్వవచ్చని అన్నారు. అయితే పాలిచ్చేటప్పుడు చేతులను శానిటైజ్ చేసుకుని గ్లోవ్స్ వేసుకోవాలని, లేదా ఎప్పటికప్పుడు హ్యాండ్ పంప్ లాంటి పరికరాలను శుద్ధి చేస్తూ వాటి ద్వారా తల్లులు పిల్లలకు పాలివ్వవచ్చని తెలిపారు.
కాగా సైంటిస్టులు చేపట్టిన ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను జామా అనే జర్నల్లోనూ ప్రచురించారు. ఇక మరో అధ్యయనంలో తల్లి పాలలో కరోనా వైరస్ను వేసి ఆ పాలను 62.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు వేడి చేశారు. అనంతరం ఆ పాలను 4 డిగ్రీల ఉష్ణోగ్రతకు చలబరిచారు. తరువాత పాలను పరిశీలిస్తే అందులో కరోనా లేదని తేల్చారు. అందువల్ల తల్లులు తమకు కరోనా సోకినా పిల్లలకు నిరభ్యంతరంగా పాలివ్వవచ్చని అంటున్నారు.