ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు, పిండి వంటకాలు, అమ్మవారి పూజలు, బాణసంచా కాల్చడం వంటివాటితో ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం కరోనాకారణం వల్ల ఈ పండుగను పెద్ద హడావిడిగా లేకుండా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే నిర్వహించుకోవలసిన అవసరం ఏర్పడింది.
ఈ దీపావళిని కరోనా జాగ్రత్తలు పాటించడంతో పాటు, టపాకాయలను కాల్చేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు తగ్గుతాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు. అయితే ఈ దీపావళి రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
*టపాకాయలను పేల్చేటప్పుడు కొన్ని పేలకుండా మధ్యలోనే ఆగిపోతాయి. అలాంటివాటిని వెంటనే వెళ్లి పట్టుకోవడం లాంటివి చేయకూడదు. అలాగే వాటిని తిరిగి వెలిగించాలనే ప్రయత్నం అసలు చేయకూడదు. ముందు జాగ్రత్తగా అలాంటి వాటిపై నీళ్లు పోయడం ఎంతో ఉత్తమం.
*బాణసంచాను ఇంట్లో కాల్చకూడదు. వాటిని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే కాల్చాలి. అంతే కాకుండా వాటిని గ్లాస్ కంటెయినర్లలో, లేదా ఇతర డబ్బాలో వేసి వెలిగించకూడదు. కొంతమంది టపాకాయలను జోబులో పెట్టుకుని తిరుగుతుంటారు ఇది అత్యంత ప్రమాదకరం.
*బాణసంచాలను కాల్చేముందు వాటి ప్యాకింగ్ పై ఉన్న సూచనలు,హెచ్చరికలను తప్పకుండా చదవాలి. మంటలు అంటుకునే అవకాశం ఉన్న ప్రదేశాలకు దూరంగా అంటే భవనాలు,కరెంటుతీగలు,ఎండుగడ్డి వంటి అగ్నిప్రమాదాలు జరిగే చోట బాణాసంచాలు కాల్చుకుండా జాగ్రత్తపడాలి.
*కాల్చిన బాణాసంచా సామాగ్రి ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక ఇసుక పోసి ఉన్న ప్లాస్టిక్ బకెట్ లో వేయండి. ఇలా చేయడం వల్ల ఆ దారిన వెళ్లేవారికి ప్రమాదం వాటిల్లకుండా ఉంటుంది.
*టపాకాయలు కాల్చే ముందు జాగ్రత్తగా బకెట్ నీళ్లు దగ్గర పెట్టుకోవడం ఎంతో ఉత్తమం.టపాకాయలు కాల్చేటప్పుడు చేతులకు దూరంగా పెట్టుకొని కాల్చాలి. చిన్న పిల్లలతో టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దవారు పిల్లలను తమవద్ద ఉంచుకుని టపాకాయలను కాల్పించాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు, కుటుంబ సభ్యులు మొత్తం కాటన్ దుస్తులను ధరించి టపాకాయలను కాల్చడం ఎంతో శ్రేయస్కరం. ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకోవచ్చు.