తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ నేతలు తిప్పికొడుతున్నప్పటికీ… ప్రజల్లో ఊహించని రీతిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చర్చ జరుగుతోంది.
కొన్ని విషయాల్లో కేసీఆర్ వైఖరి ఆయనకే ఇరకాటంగా మారుతోందని అంటున్నారు. తాజాగా మొహర్రం జరిగిన తీరు విషయంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది.
కోర్టు ఏం చెప్పింది?
మొహర్రం ర్యాలీల విషయంలో ఉత్కంఠ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 30న హైదరాబాదులోని పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపుకు అనుమతించేలా పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఊరేగింపుకు తాము అనుమతిని ఇవ్వలేమని చెప్పింది. మొహర్రం ఊరేగింపుకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక పిటిషన్ నిరాకరించిందని పేర్కొంటూ తాము కూడా పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. అదే విధంగా కరోనా వ్యాప్తి క్రమంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని చెప్పింది.
హైదరాబాద్లో ఏం జరిగింది?
అయితే, మొహర్రం సందర్భంగా ఆదివారం రోజున పాతబస్తీలో బీబీకా అలం ర్యాలీని నిర్వహించారు. మొహర్రం ర్యాలీకి పరిమితి, షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. అయితే, పోలీసుల హెచ్చరికలు పాటించకుండా, కరోనా నిబంధనలు పాటించకుండా నిర్వాహకులు ర్యాలీని నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో షియాలు పాల్గొన్నారు. అయితే, ఈ ర్యాలీలో కరోనా, లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు పాతబస్తీలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు.
కేసీఆర్ …బుక్కవుతున్నారా?
అయితే ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యలో హిందూ సమాజం ఇబ్బందులు పడుతోందన్నారు. కోవిడ్ ను అడ్డంపెట్టుకొని బోనాలు, ఉగాది, శ్రీరామ నవమి, గణేశ్ పండుగలు చేసుకోనివ్వలేదని సంజయ్ ఆరోపించారు. గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందన్నారు. అదే సమయంలో ఆదివారం పాతబస్తీలో జరిగిన మొహరం ర్యాలీని ఎందుకు అడ్డుకోలేదని ంబడి సంజయ్ ప్రశ్నించారు. గణేష్ నవరాత్రులకు లేని పర్మిషన్ మొహరంకు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. పోలీసులే దగ్గరుండి.. వేల మందితో ర్యాలీ నిర్వహించారని, హిందువులు గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క వర్గానికే కొమ్ము కాస్తోందని, ఎంఐఎం ప్రతినిధిగా హోంమంత్రి వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ తప్పుబట్టారు. హిందూ సమాజానికి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ డిమాండ్ చేశారు.