అయ్యో ..! జగన్ మూడేళ్లకే పదవి దిగిపోతాడా..?
ఏమిటీ..!? 2022 లో ఎన్నికలు తప్పవా..?
ఆహా..! టీడీపీ, బీజేపీ అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయా..??
ఏమో జమిలి ఎన్నికలు రావచ్చు, రాకపోవచ్చు..! కానీ కేంద్రంలో బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇటు టీడీపీ, బీజేపీ ముఖ్యుల నోటి నుండి ఆ మాటలు మాత్రం వస్తున్నాయి. అంటే అయినట్టేగా..? బీజేపీ అనుకుంటే కానిదేమున్నది..? చంద్రబాబు లాంటి నేత కూడా “జమిలి వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి” అన్నాడంటే ఇక జమిలి వచ్చినట్టేనా..? ఆ అవకాశాలు, ఆ అంశాలు ఒకసారి చూద్దాం..!!
వ్యతిరేకిస్తున్న పార్టీలు : కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే పార్టీలు జమిలి ఎన్నికల్ని వ్యతిరేకిస్తున్నాయి.
అనుకూలంగా ఉన్న పార్టీలు : బీజేపీ, ఎన్డీఏలోని కొన్ని పక్షాలు, టీడీపీ, అన్నా డీఎంకే. ఇంకా టీఆరెస్, వైసీపీ తమ అభిప్రాయాలను చెప్పలేదు.
జమిలి ఎప్పటి మాట అంటే : జమిలి ఎన్నికలు అంటే సింపుల్ గా ఒక దేశం.. ఒకే సారి ఎన్నికలు. అంటే లోక్ సభతో పాటూ.., దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలి ఎన్నికలు అంటే..!! ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన మాట కాదు. 1967 వరకు అలాగే జరిగేవి. 1952 , 1957 , 1962 , 1967 లో ఎన్నికలు అలాగే జరిగాయి. కానీ కాలక్రమేణా పరిస్థితి మారిపోయింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకొస్తుంది.
బీజేపీ వాదన ఏమిటంటే..!?
దేశంలో 2019 లో ఎన్నికల నిర్వహణకు రూ. 60 వేల కోట్లు ఖర్చు అయినట్టు తెలుస్తుంది. ఈసీ ఖర్చు సహా.., వివిధ పార్టీలు చేసిన ఖర్చు కలిపి. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అయితే రూ. 8 నుండి 10 వేల కోట్లు ఖర్చు తప్పనిసరి. ఈ ఖర్చుని తగ్గించడం, ఈసీకి శ్రమ తగ్గించడం.., అన్ని కలిసి వస్తాయని బీజేపీ జమిలికి సై అంటుంది. పనిలో పనిగా అధ్యక్షా తరహా పాలనకు ప్లాన్ వేస్తుంది. కానీ కొన్ని స్వతంత్ర సంఘాలు మాత్రం జమిలి ఎన్నికల కంటే ముంది పార్టీల్లో ఖర్చులు, ఆదాయ మార్గాల్లో, అభ్యర్థుల ఆస్తుల వెల్లడిలో స్పష్టత రావాలని కోరుతున్నాయి.
విశ్లేషకులు ఏమంటున్నారు..!?
జమిలి ఎన్నికలు సాధ్యమే అయినా..! ఓటింగ్ లో ప్రాక్టీకల్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో దేశ భద్రత, రక్షణ రంగం.., ధరలు, నిరుద్యోగం వంటి అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి.., కానీ శాసన సభ ఎన్నికల్లో మాత్రం సంక్షేమ పథకాలు, అవినీతి అంశాలు, శాంతి భద్రతలు, విద్య, వసతులు, ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇలా ఒకేసారి భిన్న అంశాలు ఆలోచించి ఓట్ వేయడం 50 ఏళ్ళు పైబడిన వారికి, గ్రామీణ ఓటర్లకు కష్టం అవుతుంది. దీని వలన కచ్చితమైన ఫలితం రాదు.. అంటూ నిపుణులు పేర్కొంటున్నారు. జమిలి కంటే ముందు కచ్చితంగా రాజకీయ పార్టీల్లో సంస్కరణలు రావాలని.. వారి నిధులు, ఆదాయ మార్గాలపై సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడి కావాల్సిందే అంటూ కొన్ని వాదనలు ఉన్నాయి.
అసలు జమిలి సాధ్యమేనా..??
దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా అనేది కీలక చర్చగా మారింది. దీనికి రాష్ట్రాల అభిప్రాయాలూ తీసుకోవాలి. మూడులో రెండొంతుల రాస్త్రాలు అంగీకరించాలి. పార్లమెంటులో చర్చ జరగాలి. అక్కడా మూడులో రెండొంతుల అంగీకారం రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి అంగీకరించాలి. ఇక్కడ బీజేపీ తలచుకుంటే ఇవేమి అసాధ్యం కాదు.
ప్రస్తుతం దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో అంగీకరిస్తే మొదటిదశ పూర్తయినట్టే. అందుకు బీజేపీ దగ్గర వ్యవస్థలున్నాయి. ఇక పార్లమెంటులో చర్చించి, దారికి తీసుకురావడం పెద్ద సమస్య కాబోదు. పైగా.., చివరాఖరికి ఎవరైనా తెగించి కోర్టుకి వెళ్లినా అక్కడ జరిగేది ఏమిటో అందరికీ తెలిసిందే..!! అందుకే చంద్రబాబు, కేసీఆర్, సోము లాంటి పెద్దోళ్ళు కూడా జమిలి ఖాయమనే అంటున్నారు. మరి ఫిక్సయిపోండి..!!