Breaking: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలు జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఎస్ 4 వాహనాల కుంభకోణం కేసులో జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ, ఆయన అనుచరుడు కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. దివాకర్ రెడ్డి రోడ్ లైన్స్, ఝటధార ఇండస్ట్రీస్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లుగా ఈడీ వెల్లడించింది.
బీఎస్ 3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ ఆ వాహనాలను బీఎస్ -4 వాహనాలుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. స్క్రాప్ కింద అశోక్ లేలాండ్ లో కొన్న 154 బస్సులను ఫోర్జరీ డాక్యూమెంట్లతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్రేషన్ చేయించి ఎన్ఓసీ పొందినట్లు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ గుర్తించింది. ఆ బస్సులను 15 రోజుల్లో ఏపీ, తెలంగాణ , ఛత్తీస్ ఘడ్, తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనితో జేసీ ట్రావెల్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబందించి ఈ ఏడాది అక్టోబర్ నెలలో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో జేసి ప్రభాకరరెడ్డిని అధికారులు విచారించారు.