హైదరాబాదు, మార్చి 25: మాజీ పార్లమెంట్ సభ్యుడు జి వివేక్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేశారు. పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని తనకు కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన టిఆర్ఎస్ నేతలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ద్రోహం కారణంగా తాను పోటికి దూరమయ్యానని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ప్లాన్ ప్రకారం పోటీ చేసే అవకాశం లేకుండా కెసిఆర్ చివరిక్షణంలో టికెట్ నిరాకరించారని వివేక్ అన్నారు. తన తండ్రి దివంగత జి వెంకటస్వామి (కాకా), తాను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని చెప్పారు. తెలంగాణ మేలు కోసమే కెసిఆర్ ఆహ్వనిస్తే పార్టీలోకి వచ్చామని వివేక్ అన్నారు.
2014లో టిఆర్ఎస్కు ఇద్దరు ఎంపిలే ఉంటే తాను తోటి ఎంపిలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే తాను చేసిన ద్రోహమా అని వివేక్ ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో కాకా చేసిన సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టారని అన్నారు. ఉద్యమంలో ఏ పాత్ర లేని వాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్లు ఇచ్చారని వివేక్ అన్నారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండటం బాధ కల్గిస్తోందని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వ పోకడలను ప్రజల మీద రుద్దుతున్నారని వివేక్ విమర్శించారు. ఈ విషయాలను ప్రజలు త్వరలో గుర్తిస్తారని వివేక్ అన్నారు. అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా సమయం తక్కువగా ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వివేక్ తెలిపారు.