హైదరాబాదు, డిసెంబర్ 25: హైదరాబాద్లో ముగ్గురు మహిళా మావోలు మంగళవారం వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఓబీ ప్రాంతం నుంచి పారిపోయి హైదరాబాద్కు నలుగురు మావోలు చేరుకున్నారన్న సమాచారంతో విశాఖ పోలీసులు గత రాత్రి మౌలాలీ ప్రాంతంలో దాడులు చేశారు. ముగ్గురు మహిళా మావోలు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ఆత్మకూరు అనూష, ఆత్మకూరు అన్నపూర్ణ, భవాని, కొర్ర కామేశ్వరరావులు వున్నారు. వీరిని రేపు కోర్టు ముందు హాజరు పరిచి విశాఖకు తరలిస్తామని ఓ అధికారి వెల్లడించారు. వీరంతా 2017 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, గత సంవత్సరం వీరు అగ్రనేత రామకృష్ణతో కలిసి పని చేశారని తెలిపారు. మన్యం ప్రాంతంలో మావోయిస్టుల సంఖ్యను పెంచుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని, యువతను మావోయిస్టుల వైపు మళ్లించారని చెప్పారు. అరెస్టయిన వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారని అన్నారు. పోలీసులపై మావోలు దాడి చేసిన మూడు ఘటనల్లో వీరు ప్రత్యక్షంగా పాలు పంచుకున్నారని వెల్లడించారు.