వైసిపి అధినేత జగన్ గత ఎన్నికలకు ముందు సామాజిక సమీకరణలు.. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో చాలా ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలోనే కొన్ని సామాజిక వర్గాల ప్రాధాన్యతను బాగా తగ్గించి మరి కొన్ని సామాజిక వర్గాల ప్రాధాన్యతను బాగా పెంచారు. అయితే ఈసారి జగన్ అగ్రవర్ణాలలో చాలా సామాజిక వర్గాల ప్రాధాన్యత పూర్తిగా లేకుండా చేసిన పరిస్థితి. మరియు ముఖ్యంగా క్షత్రియ, వైశ్య, కమ్మ, కాపు సామాజిక వర్గాలకు గతంలో ఉన్న సీట్లలో బాగా కోత పెట్టేశారు. విచిత్రం ఏంటంటే క్షత్రియ సామాజిక వర్గానికి ఎప్పుడూ ఉండే నరసాపురం పార్లమెంటు సీటును కూడా పీకి పడేశారు.
కమ్మ సామాజిక వర్గానికి గత ఎన్నికలలో మూడు పార్లమెంట్ సీట్లు ఇస్తే.. ఈసారి విజయవాడ సీటు మినహా ఎక్కడ ఈ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. గత ఎన్నికలలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి జగన్ ఏకంగా నాలుగు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, బాపట్లలో కోన రఘుపతి, విశాఖ సౌత్ లో ద్రోణం రాజు శ్రీనివాసులు, విశాఖ తూర్పులో అక్రమాని విజయనిర్మలకు సీట్లు ఇచ్చారు. ఈ నలుగురిలో విశాఖ నుంచి పోటీ చేసిన విజయనిర్మల, ద్రోణం రాజు ఓడిపోగా.. మల్లాది విష్ణు, కోన రఘుపతి విజయం సాధించారు.
కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఇక తాజా మార్పులు, చేర్పులలో బ్రాహ్మణులకు గత ఎన్నికల్లో ఇచ్చిన 4 సీట్లలో.. మూడు సీట్లలో కోత పెట్టేశారు. విశాఖ నగరంలో రెండు సీట్లు ఇవ్వలేదు. విజయవాడలో మల్లాది విష్ణును పక్కనపెట్టి.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీలో మిగిలిన ఒకే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గ ఎమ్మెల్యే కోన రఘుపతి సీటును కూడా జగన్ చింపేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోన రఘుపతి 2014, 2019 ఎన్నికలలో వరుస విజయాలు సాధించారు.
జగన్ ఆయనకు డిప్యూటీ స్పీకర్గా ఛాన్స్ ఇచ్చారు. అయితే నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఈసారి రఘుపతికి తాము సహకరించే పరిస్థితి లేదని.. కచ్చితంగా వైసీపీ నుంచి సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడుతుంది. నియోజకవర్గంలో రెడ్లు అందరూ ఏకమై రఘుపతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రఘుపతిని కూడా పక్కన పెట్టేసి ఆ స్థానంలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తనయుడు గాదె మధుసూదన్ రెడ్డి లేదా గుంటూరు నగరానికి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఏది ఏమైనా గత ఎన్నికలలో బ్రాహ్మణలకు ఏకంగా నాలుగు సీట్లు ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన జగన్.. ఇప్పుడు బ్రాహ్మణలకు ఒక సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సామాజిక వర్గంపై కూడా జగన్కు నమ్మకం పోయినట్టు ఉందని.. అందుకే బ్రాహ్మణుల సీట్లలో జగన్ కోతపెట్టేసాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.