సంక్షోభ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారని వైసిపి వారు గొప్పలకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న ఏపీపై ఈ సంక్షేమ పథకాల భారం భారీగా పడి రాష్ట్ర ఖజానాకు గండి పడిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వాటి అమలులో మాత్రం జగన్ వెనకడుగు వేయడం లేదు. సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో తప్పు లేదు. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని నడిపేందుకు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు జగన్ అప్పుడు అనుకోకుండా ఆదాయ మార్గాలను అన్వేషించానల్సి ఉంది.
విశ్లేషకుల నుండి మీడియా నుండి ఎన్నో చివాట్లు తర్వాత జగన్ ఈ క్రమంలో ఒక ముందడుగు వేశారు. ఖజానా నింపుకునేందుకు మెజారిటీ ప్రజలు పెద్దగా పట్టించుకోని అంశాలలో ఆయన ధరలను పెంచారన్న అభిప్రాయాలు ఇప్పుడు కొత్తగా వ్యక్తమవుతున్నాయి. భారీగా మద్యం ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరలు, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు అంటూ ఎంతో సైలెంట్ గా జగన్ బాదుడు మొదలు పెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి అనూహ్య రీతిలో లాభం చేకూరుతోంది. ఇపుడు మూడు రాజధానుల నేపథ్యంలో అటు కర్నూలు…. ఇటు విశాఖలో భారీగా భూములు అమ్మకానికి, కొనుగోలుకి వస్తున్నాయి. కేవలం ఆ రెండు సిటీల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా రేట్లు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు సామాన్య ప్రజలపై అధిక భారం పడేలా ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు కూడా పెంచేశారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత తాజాగా రవాణా శాఖలో కూడా జగన్ పన్నులు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రవాణా శాఖలో పన్నుల పెంపు ద్వారా దాదాపు జగన్ టార్గెట్ రూ.400 కోట్లు అని సమాచారం. ఫోర్ వీలర్ కు లైఫ్ టాక్స్ సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఇక టూ వీలర్ ఫోర్ వీలర్ 2010 తర్వాత పన్ను పెంచలేదు. ప్రస్తుతం అది 9.12 శాతంగా ఉంది. టూ-వీలర్ పై పన్ను పెంపు వల్ల ఖజానాకు రూ.174 కోట్లు లాభం రానుండగా… ఫోర్ వీలర్ పై లైఫ్ టాక్స్ పెంచడం వలన రూ.140 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక వివిధ వాహనాల ద్వారా అదనంగా మరో రూ.30 కోట్లు వచ్చి ఒళ్లో పడతాయి. సో ఇలాంటి వాటి పై ధరలను పెంచినా ఎవరు పట్టించుకోకుండా వ్యూహాత్మకంగా ఖజానా ఆదాయం పెంచుకుంటున్న జగన్ ఇలా ఎన్ని రోజులు పబ్బం గడుపుతారో చూడాలి.