ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల సమస్య ముదిరిపోయింది రెండు బలమైన వ్యవస్థల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇటీవలి కాలంలో దేశంలో ఎక్కడా చోటు చేసుకోలేదు అని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నడుస్తున్న పంచాయతీ చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.
జగన్ మొండి… నిమ్మగడ్డ జగమొండి..!
సోమవారం ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు లో విచారణ జరగాల్సి ఉంది. అయితే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు వద్దనే వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యవస్థల మద్దతు జగన్ కే ఉంది. అయితే నిమ్మగడ్డ మాత్రం తనకు పెద్దగా మద్దతు లేకపోయినా.. మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు.
ఇది కలవరపాటే….
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దానిని ఉద్యోగ సంఘాలు బాయ్ కాట్ చేశాయి. కీలక అధికారులు ఎన్నికల కమిషనర్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరు కావడం కూడా జరిగింది. రేపు సుప్రీంకోర్టు లో ఈ విచారణపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో జగన్ కు కొద్దిగా కలవరపాటుకు గురి చేసేలా ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. బిజెపి పాలిత, మోదీ సొంత రాష్ట్రామైన గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ పాయింట్ పట్టుకుంటే….?
ఏపీలో కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు వద్దకు వెళ్లి వ్యాక్సినేషన్ ను కారణంగా చూపి ఎన్నికలు ఆపించేశారు. మొదట హైకోర్టు ఎన్నికల రద్దుకి అంగీకరించిన తర్వాత నిమ్మగడ్డ పిటిషన్ వేసి అనుమతి పొందాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు సాధ్యం కాదు అని చెబుతుంటే గుజరాత్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్ జారీ కావడం చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు అడ్దుగా ఉన్న అంశాలను గుజరాత్ లో కూడా అడ్డుగా రావాలి కానీ అక్కడ ఎటువంటి సమస్య లేకపోవడం రేపు విచారణ విషయం పై కొద్దిగా ప్రభావం చూపుతుందని ఏపీ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది.
గుజరాత్ లో ఫిబ్రవరి 21, 28 తేదీల్లో రెండు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది.