ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ వేడి మొదలైంది. అయితే అధికార వైసిపి ఒంటరిగా పోటీ చేస్తూ ఉండటంతో ఆ పార్టీ తరఫున ఇప్పటికీ పోటీ చేసే గెలుపు గుర్రాలు ఖరారు అయ్యారు. ప్రతిపక్ష టిడిపి పొత్తులో ఉండడంతో ఏ సీటు ఎవరికి వెళుతుంది ? అన్నదానిపై ఇంకా కొన్ని చోట్ల క్లారిటీ లేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది ఎమ్మెల్యే సీట్లతో పాటు.. శ్రీకాకుళం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వైసిపికి – టిడిపికి సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసన్నపేటలో ధర్మాన కృష్ణ దాస్ మరోసారి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు బలమైన ప్రత్యర్థి లేరు.
శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు గెలుపు దారిని టిడిపి అసమ్మతి నేతలు చూపిస్తున్నట్టు ఉంది. అక్కడ టిడిపి రెండు వర్గాలుగా విడిపోయింది పైగా ఈ సీటు బిజెపికి ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే ధర్మాన గెలుపు గ్యారెంటీ అని చెప్పాలి. అందుకే ధర్మాన ఇటీవల బాగా రిలాక్స్ అయ్యారని వైసీపీ వాళ్లు చెపుతున్నారు. ఇక పలాసలో మంత్రి శ్రీదిరి అప్పలరాజుకు వరుసగా రెండోసారి గెలుపు తప్పదని అంటున్నారు. టిడిపి నుంచి గౌత శిరీష గట్టి పోటీ ఇచ్చిన ఇక్కడ మొగ్గు మాత్రం వైసీపీకే ఉంది. అప్పలరాజుకు శిరీష బలమైన ప్రత్యర్థి కారు అన్న అంచనాలు ఉండడంతోనే శిరీష అభ్యర్థిత్వాన్ని ఇంకా ఇక్కడ పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది.
శిరీష కాకుండా మరో ఇద్దరు ముగ్గురు బలమైన నేతల పేర్లు కూడా పలాసలో పరిశీలనలో ఉన్నాయి. పైగా ఆమె ఇటీవల వరకు ఎక్కువుగా కేడర్ను వదిలేసి వైజాగ్లో ఉండడం ఆమెకు మైనస్ అయ్యింది. అలాగే పలాస సీటు జనసేన కూడా అడుగుతుంది. ఇక ఇచ్చాపురంలో ఈసారి వైసిపి జెండా ఎగరేయాలని కార్యకర్తలు కసితో పనిచేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇచ్చాపురం టిడిపి వన్ సైడ్ గా గెలిచే సీటు అని అందరూ అనుకున్నారు. అయితే ఈసారి మాత్రం టిడిపి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కుమార్కు వైసిపి అభ్యర్థి పిరియా విజయా నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు.
పైగా అశోక్ రెండు సార్లు గెలిచిన నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న అసంతృప్తి కూడా నియోజకవర్గ ప్రజలలో ఉంది. ఇక పాతపట్నంలో వైసిపి బలంగా ఉంది. ఇక్కడ అభ్యర్థిని సరైన వారిని పెట్టాల్సి ఉంది. పాలకొండ సీటును జనసేనకు ఇస్తున్నారు. జనసేన అక్కడ వైసీపీని ఢీకొట్టి ఎంతవరకు గెలుస్తుంది అన్నది సందేహమే. ఇక టెక్కలి – ఆముదాల వలసలో మాత్రం టిడిపి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజాంలోను టిడిపి బలంగా ఉన్న గట్టి పోటీ తప్పదని అంటున్నారు. ఎచ్చర్లలో వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు ఖరారు కాగా.. టిడిపి నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నది క్లారిటీ లేదు. ఏదేమైనా నిన్నటి వరకు పొత్తులో భాగంగా టీడీపీ 90 % సీట్లలో గెలుస్తుందనుకున్న శ్రీకాకుళంలో ఇప్పుడు వైసీపీ 50 – 50 చేసేసిందనే అంటున్నారు.