టీడీపీ – జనసేన పొత్తుల్లో ముందు నుంచి ఒక చర్చ బలంగా ఉంది. అయితే జనసేన పక్కాగా గెలిచే సీట్లే తీసుకోవాలి.. జనసేనకు సంస్థాగతంగా బలం ఉన్న సీట్లు.. లేదా టీడీపీ సపోర్ట్ చేస్తే గ్యారెంటీగా గెలుస్తామన్న సీట్లే తీసుకోవాలి.. అలా కాకుండా పూర్తిగా టీడీపీ బలం వాడుకుని సీటు గెలిచేద్దామనుకుంటే ఆ సీటు విషయంలో జనససేన అంచనాలు తల్లకిందులవ్వడంతో పాటు టీడీపీ గెలిచే సీటును కూడా బంగారు పల్లెంలో పెట్టి వైసీపీ చేతుల్లో పెట్టినట్టే అవుతుంది. ఇప్పుడు ఏలూరు జిల్లాలో ప్రతిష్టాత్మక పోలవరం సీటు విషయంలోనూ ఇదే జరగబోయేలా ఉంది.
ఉమ్మడి పశ్చిమగోదావరిలో జనసేనకు తాడేపల్లిగూడెం – నరసాపురం – భీమవరం సీట్లు ఫిక్స్ అయ్యాయి. మరో రెండు సీట్లు కావాలని జనసేన ఆశ. తణుకు, నిడదవోలు ఆప్షన్గా ఉన్నా తణుకు సీటు టీడీపీ ఇవ్వదంటే ఇవ్వదు. ఇక నిడదవోలుతో పాటు అన్ని జనరల్ సీట్లు కాకుండా ఎస్టీ సీటు నుంచి తమ పార్టీ ఎస్టీ నేతలు పోటీ చేయాలని పోలవరం కోరుతోంది జనసేన. ఇక్కడే పెద్ద తకరారు వచ్చి పడుతోంది.
పోలవరంలో తెలుగుదేశం పార్టీతో పోలిస్తే జనసేన బలం చాలా చాలా నామమాత్రం. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో ఓడిన ఇన్చార్జ్ బొరగం శ్రీనివాసులు ఐదేళ్ల నుంచి నియోజకవర్గంలో పార్టీని బతికించుకుంటున్నారు. పోలవరం అత్యంత సంక్లిష్ట నియోజకవర్గం. పైగా టీడీపీ గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. చంద్రబాబు పోలవరం పేరుతో తరచూ ఇక్కడే పర్యటనలు చేశారు. అటు తెలంగాణ నుంచి విడివడిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కూడా ఇదే నియోజకవర్గంలో విలీనమయ్యాయి.
బొరగం శ్రీను ఓ జనరల్ సీటులో అభ్యర్థులు ఎంత ఖర్చు పెడతారో అదే స్థాయిలో ఖర్చు పెట్టి ఈ రోజు ఇక్కడ పార్టీని బతికించుకున్నారు. శ్రీను 2009లో ప్రజారాజ్యం నుంచి కూడా ఇక్కడ పోటీ చేశారు. అంటే 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. పైగా క్లీన్ ఇమేజ్.. అవినీతి మచ్చలేదు.. వివాద రహితుడు… అన్ని వర్గాలు ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తున్నాయి. పార్టీని, కేడర్ను కాపాడుకోవడంలోనూ ఇటు పోలవరం వరదల్లో చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఈ సారి పక్కా విన్ సీట్లలో పోలవరం కూడా ఉంది. పైగా పోలవరం టీడీపీకి టఫ్గానే ఉంటోంది. పార్టీ గెలిచిన 2014లో 15 వేల మెజార్టీ వస్తే.. ఓడిన 2012 ఉప ఎన్నిక, 2019లో 45 వేల ఓట్లతో రెండుసార్లు ఓడిపోయింది.
ఇలాంటి చోట చాలా సునిశితంగా ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకోకుండా జనసేనకు ఇస్తే సీటు గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. అసలేం మాత్రం బలం లేని సీటు తీసుకుని జనసేన కూడా ఒక సీటు లాస్ అవ్వడం మినహా ఆ పార్టీకి కలిసొచ్చేది కూడా ఉండదు. ఇటు టీడీపీ గెలిచే సీటు చేజేతులా వైసీపీకి ఇచ్చినట్లవుతుంది. ఒకవేళ రిజర్వ్డ్ సీట్లు కూడా జనసేన ఆప్షన్లో ఉంటే రంపచోడవరం ఎస్టీ సీటులో కాపుల ప్రాబల్యం ఎక్కువ. అక్కడ సర్దుబాటు చేయవచ్చు. పైగా అది అల్లూరి జిల్లాలో ఉంది.
అలాగే కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లోనూ కాపుల ఓటింగ్ చాలా చాలా ఎక్కువ. ఈ రెండు సీట్లు కాదని పోలవరం సీటు ఇవ్వడం పెద్ద రాంగ్ స్టెప్పే. పైగా పోలవరంలో గెలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కూడా ఉండనే ఉంది. ఈ క్రమంలోనే పోలవరం అసెంబ్లీ సీటు విషయంలో జనసేన – టీడీపీ సమన్వయంతో సరైన నిర్ణయం తీసుకోకపోతే గెలుపుపై ఆశలు ముందే వదిలేసుకోవాల్సిందే.