వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఏ నియోజకవర్గం ఆయన కు కలిసి వస్తుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. అదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. ఇక్కడ నుంచే పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు కీలక నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అక్కడ ఆయన ఓడిపోయారు. దీంతో ఈ దఫా నియోజకవర్గాలు మారుస్తారనే చర్చ జరిగింది.
కానీ, తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో పవన్ తన వ్యూహాన్ని కూడా మార్చుకున్నట్టు తెలుస్తోంది. పడిన చోట నుంచే గెలుపు గుర్రం ఎక్కాలని ఆయన భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సమీకరణలు మారిన భీమవరం నియోజకవర్గంలోనే పవన్ పోటీ చేసే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. తాజాగా బుధవారం నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనలు ప్రారంభిస్తు న్నారు. 14 నుంచి నిర్విరామంగా ఆయన పర్యటించనున్నారు. వీటి ఉద్దేశం పార్టీని డెవలప్ చేయడం.
అదే సమయంలో పార్టీలో టికెట్లు ఆశిస్తున్నవారిని ఆయన బుజ్జగించనున్నారు. మొత్తంగా పవన్ పర్యటన భీమవరం నుంచే ప్రారంభంకానుంది. అనంతరం… అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో పర్యటించి.. సభల్లో ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో తన తొలి అడుగు భీమవరం నుంచే వేస్తుండడం, ఇప్పుడు ఇక్కడ రాజకీయ సమీకరణలు కూడా మారుతున్న క్రమంలో పవన్.. వ్యూహాత్మకంగా మరోసారి ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీలో నేతలు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ ఇక్కడ పవన్పై విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు, పవన్కు 62,285 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కు 54,037 ఓట్లు వచ్చాయి. అయితే.. ఇప్పుడు టీడీపీ-జనసేన పొత్తు ఉండడంతో పవన్ విజయం నల్లేరుపై నడకేనన్నది పరిశీలకుల అంచనా. ఇదే మాట జనసేన నాయకులు కూడా చెబుతున్నారు.