అభిమానులందు వీరాభిమానులు వేరయా అన్నట్లుగా ఉంది ఒక పవన్ అభిమాని యవ్వారం. తెలియక చేశాడా అంటే… ఆయన ఇచ్చిన ఇన్ ఫర్మేషన్ కరెక్టే! తెలిసేచేశాడా అంటే… పవన్ వీరాభిమానాయే! ఈ విషయంపై ఎలా స్పందించాలో తెలియని జనసేన పార్టీ.. సగం అవునని, సగం కాదని స్పందించి.. కొత్త అనుమానాలు క్రియేట్ చేసింది!
వివరాళ్లోకి వెళ్తే… జనసేన పార్టీ వీరాభిమాని అత్యుత్సాహంతో ఒకపని చేసి పార్టీని ఇరుకునపాడేసినంత పనిచేశాడు! ఇంతకూ ఆ వీరాభిమాని చేసిన పనేమంటే… “త్వరలో పార్టీ అధినేత జన్మదినం రాబోతోంది.. ఆ నాయకుడికి బహుమతిగా మనిషికో రూ.వంద విరాళంగా ఇచ్చి పార్టీ ఫండ్ రూ.200 కోట్లు చేద్దాం” అంటూ ట్విటర్లో పోస్టు ద్వారా పిలుపునిచాడు. దాంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరలై కూర్చుంది!
అక్కడితో ఆగకుండా.. ఆ విజ్ఞప్తితో పాటు “జనసేన పార్టీ” బ్యాంకు ఖాతాతో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉన్న ఫొటో కూడా పెట్టాడు. ఈ ట్వీట్ తెగ వైరలవడంతో పాటు ప్రధాన మీడియాలో కూడా వచ్చేసింది. దీంతో.. ఈ వ్యవహారం జనసేన పార్టీ అధిష్టానం గుర్తించి.. ఖండించింది! జనసేన పార్టీ అభిమానుల నుంచి డబ్బులు సేకరించడాన్ని వ్యతిరేకిస్తుందని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ మెసేజుకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
కాగా, గతంలో 2019లో కూడా పవన్ కల్యాణ్ పార్టీ పెడుతున్నారు.. చందాలివ్వండి అని కొందరు బ్యాంక్ ఖాతాలు తెరిచి అభిమానులను కోరిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి! ఇక్కడ విచిత్రం ఏమిటంటే… ఆ మెసేజ్లో ఉన్న బ్యాంకు అకౌంట్ తమదేనని జనసేన ధృవీకరించడం!!