KCR : తెలంగాణలో గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉప్పు, నిప్పుగా ఉండే పరిస్థితి. అయినప్పటికీ ఓ విషయంలో బీజెపీ నేతల ప్రతిపాదనకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లు ఆమోదించడంతో బీజేపీ నేతలు ఫిదా అయి వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
KCR : మేము పోటీ పెట్టం
ఇంతకూ విషయం ఏమిటంటే…ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పోరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆకాల మృతి చెందారు. ఈ డివిజన్ కు ఈ నెల 30వ తేదీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ దివంగత కార్పోరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కుమారుడిని కార్పోరేటర్ టికెట్ ఖరారు చేసింది.
అయితే బీజేపీ గెలుచుకున్న ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు గానూ ఆ పార్టీ నేతలు అధికార టీఎస్ఎస్ ను సంప్రదించాలని భావించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం శుక్రవారం ప్రగతి భవన్ కు వెళ్లి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ను కలిసి విషయాన్ని తెలియజేశారు.కేటిఆర్ ను కలిసిన వారిలో ఎల్పీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, దివంగత రమేష్ గౌడ్ సతీమణి , కుమారులు, ఇరు పార్టీల నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంలో కేటిఆర్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేయకముందే రమేష్ గౌడ్ మృతి చెందడం దురదృష్టకరమని, వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దని వచ్చిన ప్రతిపాదనను పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ప్రతిపాదనకు సమ్మతించారనీ తెలిపారు. మనవతా దృక్పదంతో ఈ నిర్ణయం తీసుకున్న టిఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లకు బీజేపీ ప్రతినిధి బృందం, రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.