ఇప్పుడు అందరి చూపు కరోనా వ్యాక్సిన్పైనే. దీనికి తోడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. అఖిల పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భారత ప్రధాని నరేంద్ రమోదీ వాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు చాలా విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.
మరికొన్ని వారాల్లో భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. అత్యంత చౌకైన, అలానే సేఫ్ అయిన కరోనా వ్యాక్సిన్ మీద ప్రపంచమంతా దృష్టి పెట్టిందని అందుకే అందరూ ఇండియా వైపు ఆశగా చూస్తున్నారు అని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
హైదరాబాద్కు అంతర్జాతీయ ప్రముఖులు
ఈ నెల 9న విదేశీ ప్రముఖులకు ఆతిధ్యమిచ్చేందుకు హైదరాబాద్ వేదిక కానుంది. 80 దేశాలకు చెందిన విదేశీ రాయబారులకు మరియు హైకమిషనర్లకు అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయడానికి ఈ పర్యటన ను విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ , అడ్వాన్స్ బృందం ఛీఫ్ ప్రోటోకాల్ అధికారి నగేశ్ సింగ్ ,ఐ.ఎఫ్.ఎస్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించి, ఈ పర్యటన కు చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఈ పర్యటన లో ప్రఖ్యాత విదేశీ రాయబారులు దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ కై పనిచేస్తున్న భారత బయోటెక్ లిమిటెడ్ మరియు బయోలాజికల్ సంస్థ పరిశ్రమ యూనిట్లను సందర్శిస్తారని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉత్పత్తి , పంపిణీకి సంబంధించి హైదరాబాద్ ప్రత్యేకతను తెలిపే విధంగా ఫార్మాసిటీ మరియు జెనోమ్ వ్యాలీ వివరాలతో కూడిన ప్రజెంటేషన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖుల పర్యటనకు కోవిడ్ -19 ప్రోటోకాల్ కు అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో కూడిన 5 బస్సులు, ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.
మోదీ జీ ఏమన్నారంటే
అఖిలపక్ష సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, మన శాస్త్రవేత్తలు సరే అన్న వెంటనే ఇండియాలో వాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ముందుగా కోవిడ్ వారియర్స్ అలానే సీనియర్ సిటిజన్లకు ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నామని ఆయన ప్రకటించారు.. ఇక ఈ కరోనా వ్యాక్సిన్ ధర విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని ఒక నిర్ణయానికి వచ్చిన వెంటనే ధర ఫిక్స్ చేస్తామని పేర్కొన్నారు. అలాగే అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యాక్సిన్ ను ఎలా పంపిణీ చేయాలి అనే విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయని ఆయన అన్నారు. అలాగే మన పంపిణీ వ్యవస్థ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం భారత్ కి అనుభవంతో పాటు మంచి నెట్వర్క్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్ లో దేశీయంగా ఎనిమిది రకాల వ్యాక్సిన్ ల తయారీ వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.