గత కొద్దిరోజులుగా థియోటర్స్ ఓపెన్ అవుతున్నాయనగానే సంక్రాంతికి తమ సినిమాలని రిలీజ్ చేయాలని ఆయా చిత్రాల నిర్మాతలు ప్లాన్ చేసుకొని రెడీ అయ్యారు. ఇక 2020 లో మిస్సయిన ఎంటర్టైన్మెంట్ ఒకేసారి పండగ సీజన్లో ఉండబోతుందని అందరూ భావించారు. కాని తాజా సమాచారం ప్రకారం ఎందుకొచ్చిన సంక్రాంతి సీజన్ .. వద్దు బాబోయ్ అంటూ సినిమాలని రిలీజ్ చేయకుండా ఒక్కో నిర్మాత తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. నిన్నా మొన్నటి వరకు పోటీపడ్డ వాళ్ళే సంక్రాంతి సీజన్ నుంచి పక్కకి జరిగి తర్వాత నెలల్లో ప్లాన్ చేసుకోవాలని .. అంతగా అయితే ఓటీటీలో రిలీజ్ చేసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారట.
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ లో నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల కూడా ఒక నిర్మాత గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపడం లేదంటున్నారు. ఇక ఒక్క భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ పరిస్థితి కూడా ఇదే అంటున్నారు. అల్లు అరవింద్ ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడం లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. బొమ్మరిల్లు భాస్కర్ కి హిట్ లేదు.. అఖిల్ కి హిట్ లేదు.. కాని ఈ సినిమా బడ్జెట్ దాదాపు 35-40 కోట్ల వరకు అయిందని టాక్.
ప్రస్తుతం ఉన్న 50 పర్సెంట్ ఆక్యూపెన్సీ తో ఇంత వసూళ్ళు రాబట్టడం కష్టమే అని భావిస్తున్నారట. అలాగే రాం కూడా డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా మంచి క్రేజ్ ఉన్న సినిమాలే తప్పుకుంటున్నప్పుడు రవితేజ మాత్రం రిస్క్ చేసి ఎందుకు దిగాలి అని కొందరి మాట. అసలే రవితేజ కి గత కొంతకాలంగా వరసగా ఫ్లాపులు వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ కోసం చాలా తాపత్రయపడుతున్నాడు. అందుకే రిస్క్ వద్దని రవితేజ ని వెనకి లాగుతున్నారట. అవసరమైతే ఓటీటీ బెటర్ అని చెప్తున్నారట. మరి రవితేజ క్రాక్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.