ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 5 రోజుల వ్యవధిలో ఒకరికి తెలియకుండ ఇంకొకరినిగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ పోలీసుల దృష్టికి రావడంతో వెలుగులోకి వచ్చింది. అతడు మధ్యప్రదేశ్, ఇండోర్లోని ముసఖేడి ప్రాంతానికి చెందిన ఓ 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పోలీసులు గుర్తించారు. అతడు ఈ నెల 12న ఖాండ్వాలోని ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు.
ఆ తర్వాత తాను భోపాల్ వెళ్ళాలని, ఒక అత్యవసరమైన పనిమీద వెళ్తున్న అని పెళ్ళికూతురికి చెప్పి వెళ్ళాడు. ఇది జరిగి ఐదు రోజులలోనే, అంటే డిసెంబర్ 17 వ తేదీన ఇండోర్లోని మోహోలో మరో మహిళను వివాహమాడాడు. ఖాండ్వాలో జరిగిన మొదటి వివాహంకు సంబంధించిన కొందరు పెళ్లికూతురి బంధువులు, మోహూలో జరిగిన అతడి రెండవ పెళ్లికి కూడా హాజరయ్యారు.
అయితే, ఆ పెళ్ళికొడుకునే మళ్ళి ఈ మండపంలో కూడా చూసేసరికి వారు షాక్ అయ్యారు. వారు వెంటనే ఆ పెళ్లిలో ఫొటోలు తీసి ఖాండ్వాలోని నూతన వధువు కుటుంబానికి పంపించారు. ఆ ఫొటోలు చూసిన కొత్త పెళ్లికూతురి కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో షాక్కు గురి అయ్యారు. వెంటనే ఖాండ్వాలోని మహిళ కుటుంబ సభ్యులు నిందుతుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికూతురి కుటుంబం ఈ పెళ్లి వేడుక కోసమై 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.
ఇక, డిసెంబర్ 17 నుంచి నిందితుడి ఫోన్ సిచ్ ఆఫ్ లో ఉంది. దీనితోపాటు అప్పటి నుంచి అతడు ఇంటికి కూడా వెళ్లకుండా ఎక్కడికో పారిపోయాడని ఖాండ్వాలోని కొత్వాలి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నందున అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.