హైదరాబాద్ : కరోనా లోక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మూత పడిన తెలుగు చిత్ర పరశ్రమ షూటింగ్ లను పునఃప్రారంభించే విషయంపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సమాలోచనలు ప్రారంభించారు. దాదాపు రెండు నెలలుగా షూటింగ్ లు నిలిచిపోవంతో అనేక మంది సీని కార్మికులు, ఆర్టిస్టులు జీవనోపాది కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రోజూవారి షూటింగ్ లను నమ్ముకుని జీవనం సాగించే జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దయనీయంగా తయారైనట్టు తెలుస్తోంది. పరిస్థితి మెరుగు పడాలంటే సినిమా షూటింగ్ లు ప్రారంభం కావాలి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో గురువారం సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ అయ్యారు.
చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్బాబు, సి.కల్యాణ్, దిల్రాజు, జెమిని కిరణ్, శ్యామ్ప్రసాద్రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్.శంకర్, కొరటాల శివ తదితరులు లాక్ డౌన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, సినీ పరిశ్రమను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు.
సినీ పరిశ్రమ పట్ల సానుకూలత
సినీ ప్రముఖులతో సమావేశం అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తలసాని చెప్పారు. అందరి అభిప్రాయలు తీసుకొని ముందుకు వెళతా మన్నారు. షూటింగ్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చించామని అన్నారు. సినిమాల చిత్రీకరణలపై ప్రాధాన్యాలు గుర్తించాలనీ, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. లాక్డౌన్ లోపు జాగ్రత్తలు పాటిస్తూ మాక్ షూటింగ్లు చేస్తామనీ వారు వివరించారని చెప్పారు. సీఎంను కలుస్తామని కూడా సినీ పరిశ్రమ ప్రముఖులు పేర్కొన్నారని తలసాని తెలిపారు. షూటింగ్లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎం కేసీఅర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తలసాని చెప్పారు.