లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆరు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు, అధికారంలోకి వచ్చి ఆరు రూపాయలు పట్టుకోలేకపోయారు, ఏడాది అయింది. అయినా కానీ నిరూపించ లేకపోయారు అని లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్మికుల మందుల్లో 150 కోట్ల స్కామ్ చేసిన మంత్రి ఒకరు, అదేవిధంగా నకిలీ పత్రాలతో బస్సులు తిప్పి ప్రజల ప్రాణాలను బలిగొన్న వారు మరొకరు. అలాంటివారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు చర్యలా..?, బీసీలు తప్పుచేస్తే అరెస్టు చేయకూడదని చట్టాలు ఎక్కడైనా ఉన్నాయా? అంటూ అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్ ని ప్రశ్నించారు.
అవినీతి చేసిన మంత్రిని అరెస్టు చేస్తే బీసీలు ఏకం కావాలి…బీసీలకు సిగ్గు ఉండాలి అని లోకేష్ మాట్లాడటాన్ని ఖండిస్తూ, బీసీలు గురుంచి మాట్లాడే విషయాలలో నోరు అదుపులో పెట్టుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ మంత్రి అనిల్ ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి మరియు అక్రమాలపై విచారణ జరపాలి అని మీ పార్టీకి చెందిన దేవినేని ఉమా అంటున్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అదే చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా లోకేష్ మాట్లాడితే చిప్పకూడు అంటున్నారని, ఎక్కువ దాని గురించి మాట్లాడకు తదాస్తు దేవతలు వింటే నీకు అదే వస్తుందని అనిల్ అన్నారు. నన్ను అరెస్ట్ చేస్తారు అని లోకేష్ అంటున్నారని, ఆయన అక్రమాలు చేస్తే తప్పకుండా అరెస్ట్ అవుతారని అనిల్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి వారసుడు నారా లోకేష్ అని చెప్పుకునే స్థితిలో ప్రస్తుతం చంద్రబాబు లేరని… మంత్రి అనిల్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన వారిని ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు.