కరోనా వచ్చి వ్యవస్థలన్నింటినీ అస్తవ్యస్తం చేసేసింది. ఉద్యోగులకు సాలరీ కటింగ్.. రోజువారీ కార్మికులకు ఉపాధి కోల్పోవడం.. యాజమాన్యాలు వ్యవస్థలు రన్ చేయలేక ఇబ్బందులు.. ఇలా అయిపోయింది పరిస్థితి. ఇటువంటి చిక్కు పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న మరో పరిశ్రమ సినీ ఇండస్ట్రీ. షూటింగ్స్ లేక కార్మికులు ఉపాధి కోల్పోతే.. భారీ సినిమాలు లైన్ లో పెట్టుకున్న నిర్మాతలకు మరో కష్టం వచ్చింది. భారీ ప్రాజెక్టులు తలకెత్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి సినిమాలు తీస్తున్న పెద్ద నిర్మాతలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మూడు నెలలుగా షూటింగ్ ఆగిపోయిన ఓ పాన్ ఇండియా సినిమా నిర్మాత తన సిబ్బందికి జీతాలు ఆపలేదు. నిజంగా ఇది మంచి విషయమే. మరో రెండు నెలల్లో షూటింగ్ స్టార్ట్ అవుతాయనుకున్నారు. నిజంగా స్టార్ట్ అయ్యుంటే బాగానే ఉండేది. కరోనా మరింత వికృతరూపం దాల్చడందో షూటింగ్స్ మరో మూడు నెలలకైనా స్టార్ట్ అవుతాయో లేదో తెలీని పరిస్థితి. ఈ దశలో ఇంకా సాలరీలు ఇవ్వలేని స్థితికొచ్చేశాడట సదరు నిర్మాత.
దీంతో సాలరీ కటింగ్ తప్పదని తేల్చేశాడట. ఎందుకంటే ఇదంతా ఎదురు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సినిమానే భారీ బడ్జెట్. ఖర్చులెక్కువ. షూటింగ్ సవ్యంగా జరిగితే ఎటువంటి ఇబ్బందీ లేదు. ఎన్నాళ్లైనా జీతాలు ఇవ్వొచ్చు. కానీ పరిస్థితంతా తారుమారై పోవటంతో సదరు నిర్మాతను కూడా తప్పుబట్టలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు సాలరీ విషయంలో ఈ ఇబ్బంది తెలెత్తినా నిర్మాత పరిస్థితిని కూడా అర్ధం చేసుకోవాల్సిందే.