ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు సీఎం జగన్ ఫించన్ను ఏటా రూ.250 పెంచుకుంటూ అందజేస్తానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన ఫించన్ను రూ.3వేలకు పెంచి ఇస్తానని చెప్పారు. తరువాత ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతానన్నారు. కానీ ఆయన ఇచ్చిన మాటను తప్పినట్లు స్పష్టమవుతుంది. మొదటి ఏడాది ఫించన్ను రూ.250 పెంచారు. దాన్నే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అయితే జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండో ఏడాది అవుతున్నా ఫించన్ పెంపుపై ఆయన ఇప్పటికీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో వైసీపీలోనే ఈ విషయంపై అందరూ తలో అభిప్రాయం చెబుతున్నారు.
ఇక సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్ను రూ.2500 వరకు పెంచాలని ఇప్పుడు ఏపీలో విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కానీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అందుకు ఆర్థిక ఇబ్బందులో, లేదా మరేదైనా కారణం ఉంటుందో తెలియడం లేదు. ఇక ఈ పరిస్థితిలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్కు.. రూ.250 ఫించన్ను ఈ ఏడాది పెంచాలని లేఖ రాశారు. ఆ పెంపును మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని రఘురామకృష్ణ లేఖ రాశారు. దీంతో ఈ లేఖ విషయం ఇప్పుడు ఏపీలో సంచలనం సృష్టిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధాప్య పించన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో ఇచ్చారు. ఈ విషయాన్ని రఘురామకృష్ణం రాజు తన లేఖలో పేర్కొన్నారు. 2019 జూలై నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని చెప్పారు కానీ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దీన్ని అమలు చేస్తున్నారని రఘురామ తన లేఖలో తెలిపారు. దీంతో లబ్దిదారులు మొత్తం 7 నెలల కాలానికి రూ.15,750 వరకు నష్టపోయారన్నారు. ఈ క్రమంలో ఆ మొత్తం లబ్ధిదారులకు వెంటనే అందేలా చూడాలని రఘురామ.. జగన్ను లేఖలో కోరారు. అలాగే చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా చూడాలని కూడా రఘురామ లేఖలో కోరారు. దీంతో ఇప్పుడీ విషయం సంచలనం రేపుతోంది.