Vizag Steel Plant : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు విషయంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్నీ దాదాపుగా ఒకే తాటిమీదకు వచ్చేశాయి. ఈ క్రమంలోనే.. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా యంగ్ హీరో నారా రోహిత్ తన మద్దతును విశాఖ ఉక్కు కోసం తెలిపాడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యమానికి మద్దతుగా ఫేస్బుక్ పోస్ట్ చేసి తన మద్దతును సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.“కూల్చడానికది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు. 32 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. నేడు ఉక్కు పరిశ్రమ ఉనికి ప్రమాదంలో పడుతోంది..”అని ఆయన పేర్కొన్నారు.
Vizag Steel Plant : ఉద్వేగం రేపేలా పోస్ట్!
ఆంధ్రుడా మేలుకో.. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడింది. సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ శ్వేదం ప్రైవేటు పరం చేయడమేనా మన సాధించిన అభివృద్ధి? ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో పిడికిలి బిగిద్దాం. గొంతు పెగలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దాం.” అంటూ ఎమోషనల్గా నారా రోహిత్ పోస్ట్ చేశారు.
ఇంతకీ ఎవరీ నారా రోహిత్ ?
రోహిత్ స్వయానా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు. రామ్మూర్తి కూడా మాజీ ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిందే .తదుపరి పరిణామాల్లో రామ్మూర్తినాయుడు రాజకీయాల్లో రాణించలేకపోయారు.దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా చంద్రబాబే ఒక పథకం ప్రకారం సోదరుడ్ని తొక్కేశారని ఆరోపణలు లేకపోలేదు.జూనియర్ ఎన్టీఆర్ మామగారు నార్నే శ్రీనివాసరావు గతంలో ఈ తరహా ఆరోపణలు చేశారు .ప్రస్తుతం రామ్మూర్తినాయుడు తీవ్ర అస్వస్థతతో ఉన్నారు.ఆయన కుమారుడు నారా రోహిత్ బాణం సినిమాతో సినీ రంగంలో ప్రవేశించారు.సోలో ,రౌడీఫెలో ,అసుర వంటి కొన్ని హిట్ చిత్రాల్లో నటించారు.ఈమధ్య ఫ్లాపుల్లో ఉన్నారు.ఈ నేపధ్యంలో ఆయన అకస్మాత్తుగా విశాఖ ఉక్కు పై ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది రోహిత్ ఇక నేరుగానే టిడిపి రాజకీయాల్లో పాలుపంచుకుంటున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి.