భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ లు వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు హజరైన ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన తన తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని వాగ్దానం చేశారు. ఆజాదీగా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు ద్రౌపది ముర్ము.
ఒడిశాలోని ఓ మారుమూల ఆదివాసీ గ్రామంలో ఓ పేద కుటుంబం నుండి వచ్చిన తాను ఈ నాడు దేశ అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇది వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. దేశ పేద ప్రజలందరికీ దక్కిన విజయంగా పేర్కొన్నారు. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని వాటిని సాకారం చేసుకోవచ్చు అని చెప్పేందుకు తన నామినేషన్ యే ఒక రుజువు అని అన్నారు. తన చిన్న తనంలో ప్రాధమిక విద్య చదువుకోవడమే ఒ కలగా ఉండేదనీ అలాంటి స్థాయి నుండి ఇక్కడి దాకా రాగలిగానంటూ ఆనందం వ్యక్తం చేశారు.
50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ తాను రాజకీయ జీవితం ఆరంభించాననీ, 75 ఏళ్ల ఉత్సవాల వేళ ప్రధమ పీఠానికి ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు ద్రౌపది ముర్ము. స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ఆదివాసీ మహిళను తానని అన్న ద్రౌపతి ముర్ము .. స్వాతంత్ర్య సమరయోధుల కలలుగన్న సుస్వరాజ్యం నిర్మాణం కోసం మరింత వేగంగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగించాల్సి ఉందన్నారు. దేశ యువత తమ కేవలం భవిష్యత్తు మీదనే కాకుండా దేశ పురోగతికి బాటలు వేయడంపై దృష్టి పెట్టాలని ద్రౌపది ముర్ము కోరారు. దేశ ప్రధమ పౌరురాలిగా వారికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. సబ్ కా ప్రయాస్ – సబ్ కా కర్తవ్య్ నినాదంతో ముందుకు వెళ్లాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు ద్రౌపది ముర్ము.