ఢిల్లీ, జనవరి 28: తననూ, కుమార్తెనూ వ్యభిచారులు అన్నందుకు, అలా అన్న భర్తను ఆ భార్య హతమారిస్తే దానిని హత్యగా పరిగణించాల్సిన పని లేదని అత్యున్నత న్యాయ స్థానం సంచలన తీర్పు నిచ్చింది. తమిళనాడుకు చెందిన ఒక మహిళ, అమె కుమార్తెను భర్త వ్యభిచారులుగా దూషించాడు. దానితో ఆ మహిళ భర్తను అక్కడికక్కడే హతమార్చింది. ఈ కేసులో ముద్దాయిలను హత్యానేరం కింద కాక దండించదగిన హత్యానేరం (కల్పబుల్ హోమిసైడ్) కింద శిక్షించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
ఆ మహిళకు పక్కింటి వ్యక్తితో సంబంధం ఉంది. భర్త ఆమెను వ్యభిచారి అన్నపుడు ఆ ప్రియుడు కోపంతో అతని చెంపపై కొట్టాడు. మహిళ, ఆమె ప్రియుడు కలిసి అతని గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చి ఆ అవశేషాలను స్నేహితుడి కారులో తీసుకువెళ్లి పారేశారు. ఈ సంఘటన జరిగిన 40రోజుల తర్వాత మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
పోలీసులు మహిళపై, ఆమె ప్రియుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు, ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు హత్యానేరాన్ని ధృవీకరించాయి. నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ మోహన్ ఎం శంతనాగౌడర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరీలు, భారత సమాజంలో మహిళ వ్యభిచారి అన్న ముద్రను సహించలేదని పేర్కొన్నారు.
భర్త తనను వ్యభిచారి అని దూషించడం వల్ల నిందితురాలు ఆకస్మిక ప్రకోపానికి గురయింది. ఆ సమయంలో వచ్చిన పిచ్చికోపంలో స్వీయ నియంత్రణను కోల్పొయి భర్తను అక్కడికక్కడే హతమార్చింది, అని జస్టిస్ శంతనాగౌండర్ తీర్పులో పేర్కొన్నారు. కింది కోర్టు తీర్పును మార్చి ముద్దాయిలకు పది సంవత్సరాల జైలు శిక్షను విధించారు.