టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ నిరసనల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం బంజారాహిల్స్ లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఆందోళన చేశారు. అరవింద్ ఇంటి అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు నిరసనకు దిగారు. బీజేపీ నేతల నిరసన సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద భద్రతను పెంచారు. కవిత ఇంటి దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అరవింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ శ్రేణులు రెండు దఫాలుగా ఆందోళనలు చేశారు. ఆ సమయంలో ఎంపి అరవింద్ నిజామాబాద్లో ఉన్నట్లు సమాచారం. మరో పక్క ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో అరవింద్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తనపైనా, కేసిఆర్ పైనా అడ్డగోలుగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని హెచ్చరించారు. భాషలేదు, మంచి లేదు, పద్ధతి లేదు, ఎవరిమీద పడితే ఎంత మాట మాట్లాడితే ఊరుకుంటామని అనుకుంటున్నావా అని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మాల్లికార్జున ఖర్గేతో మాట్లాడానంటూ తప్పుడు మాటలను అరవింద్ మాట్లాడుతున్నారని అన్నారు.
రాజకీయాలు చేయ్ కానీ పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. పార్లమెంట్ లో అరవింద్ పనితీరు సున్నా అని,, ఆయన నాలుగేళ్లలో కేవలం అయిదు సార్లు మాత్రమే మాట్లాడారని అన్నారు. ఇన్నాళ్లు బురద మీద రాయి వేయ కూడదనే అరవింద్ ను పట్టించుకోలేదనీ, కాని మితి మీరి మాట్లాడుతుంటే సహించలేక అరవింద్ మాటలకు బాధపడి మాట్లాడాల్సి వస్తుందనీ, ఇందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నానని అన్నారు కవిత.