కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం ఆదివారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న ఉమైద్ భవన్లో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 1500 మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో కీలక నాయకులు.. దూరంగా ఉన్నారు. దీనికి వివిధ కారణాలు ఉన్నాయని సమాచార. ముఖ్యంగా షర్మిల సోదరుడు, సీఎం జగన్ రిసెప్షన్కు వెళ్లినా.. పెళ్లికి మాత్రం దూరమయ్యారు. వివాహ వేడుకను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.
మూడు రోజులపాటు షర్మిల తన తనయుడు రాజారెడ్డి, ప్రియల వివాహ వేడుకలు అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుని.. ఆ మేరకు కుటుంబ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. 16వ తేదీ సంగీత్, మెహందీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను షర్మిల తన ట్విట్టర్లో పంచుకున్నారు. ఇక, శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజారెడ్డి, ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా ఒకటయ్యారు. ఇక 18వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు నూతన వధూవరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకుని పెళ్లి క్రతువును పూర్తి చేశారు.
వాస్తవానికి ఎంగేజ్మెంట్ వేడుక జనవరి 18వ తేదీన హైదరాబాద్లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ తో పాటు, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న షర్మిల తన కుమారుడి వివాహ వేడుకకు రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియాగాంధీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులను ఆహ్వానించారు. కానీ, వారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలోను, అసెంబ్లీ సమావేశాల కారణంగా దూరమయ్యారు.
నెటిజన్ల ఆసక్తి..
ఇదిలావుంటే.. షర్మిల కుమారుడి వివాహానికి సంబంధించిన వీడియోలను ఆమె నెటిజన్లతో పంచుకున్నారు. ఫొటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే.. వీటిని చూసిన నెటిజన్లు.. రెండు కీలక విషయాలపై దృష్టి పెట్టారు. ఒకటి.. ఈ వివాహానికి అయిన ఖర్చు. రెండు సీఎం జగన్ వచ్చారా? రాలేదా? అనే విషయంపై ఎక్కువగా ప్రశ్నలు సంధించారు. ఖర్చు విషయంపై కొందరు నెటిజన్లు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారని అనగా.. మరికొందరు కనీసంలో కనీసం 200 కోట్ల వరకు అయి ఉంటుందని పేర్కొన్నారు. అయితే. ఒకరిద్దరు మాత్రం 50 కోట్ల వరకే ఖర్చు పెట్టి ఉంటారని అన్నారు.
మొత్తంగా ఖర్చుపై చాలానే చర్చ జరిగింది. ఇక, జగన్ ఏపీలోనే ఉండిపోవడం, సిద్ధం సభను నిర్వహించడంపై కొందరు పెదవి విరిచారు. రాజకీయాలను రాజకీయాలకే పరిమితం చేయాలని వ్యాఖ్యానించారు. సొంత మేనల్లుడి వివాహానికి మించిన కార్యక్రమం ఏంటుంటుందని కొందరు పేర్కొనగా.. ఆ బంధం బీటలు ఇచ్చి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా షర్మిల పెళ్లి వ్యవహారం.. నెటిజన్ల మధ్య ఆసక్తిగా మారింది.