తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదునైన కామెంట్లకు ఆయన ప్రసంగం పెట్టింది పేరు. అయితే, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత ఆ దూకుడు తగ్గింది అనే భావన ఉంది.
కానీ తాజాగా తన దూకుడు తగ్గలేదు అని కేసీఆర్ నిరూపించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో కేసీఅర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఎన్నికలా…మున్సిపల్ ఎన్నికలా అన్నట్లుగా పరిస్థితి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
వణుకు పుట్టించిన కేసీఆర్
వరదల్లో మునిగినం.. ఆదుకోండి అని అంటే పైసా ఇవ్వలేదు… కానీ, ఓట్లని ఇప్పుడు వరదలా వస్తున్నారు అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బక్క కేసీఆర్ని కొట్టడానికి ఎంత మంది వస్తారు? అంటూ ప్రశ్నించారు. యూపీ నుండి కర్ణాటక నుండి వస్తున్నారు… ఇది జాతీయ ఎన్నికలా? మున్సిపల్ ఎన్నికలే కదా అని వ్యాఖ్యానించారు. `నేను ఢిల్లీకి పోతున్నా అని అక్కడి వాళ్లకు వణుకు పుట్టింది. అందుకే నన్ను ఇక్కడే ఆపివేయాలని అందరూ ఇక్కడికి వస్తున్నారు“ అని మండిపడ్డారు. టెంటే లేదు.. ఫ్రెంట్ పెడతారట అంటున్నారు.. ఫ్రెంట్ పెడుతున్న అని ఎవడు చెప్పిండు? అని ప్రశ్నించారు. మేం ఏట్ల వస్తామో చూపెడతాం అని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ మగతనం ఉన్న పార్టీ అంటూ కామెంట్ చేశారు.
తలపుండ్లు కడుగుతా..
“ఉత్తరప్రదేశ్ సీఎంకి అసలు టికానే లేదు… ఆయన నాకు నీళ్లు ఇస్తాడట. యూపీ 25 ర్యాంకుల్లో ఉంది.. 25వ ర్యాంకోడు వచ్చి ఐదో ర్యాంక్ వచ్చిన మనకు చెప్తాడట“ అంటూ కేసీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ ఉద్యమం సాధనలో కూడా ఇలాంటి మాటలే అన్నారన్న ఆయన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినోళ్లు మాటలు చెప్పి పోతారని అన్నారు. తలపుండు కడిగేది తానే అనేది ఆలోచించుకోవాలని ఆయన పేర్కొన్నారు.